పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట ఉగ్రస్థావరంపై భారత వాయుసేన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అయితే ఇవాళ (మార్చి-23) పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ…. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేశారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతి, సామరస్యం అవసరమని ఇమ్రాన్ అన్నారు. కాగా అయితే మోడీ పంపిన గ్రీటింగ్ సందేశాన్ని ఇమ్రాన్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. జాతీయ దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ఉగ్రవాద, హింస రహిత వాతావరణంలో ప్రజాతంత్ర శాంతియుత, ప్రగతిశీల శ్రేయోదాయక ప్రాంతంగా భారత్ ఉపఖండాన్ని అభివృద్ధి చేసేందుకు రెండు దేశాలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ తన సందేశంలో పేర్కొన్నట్లు ఇమ్రాన్ ట్వీట్లో చెప్పారు. మోడీ పంపిన సందేశానికి ఇమ్రాన్ వెల్కమ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలపై సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ అంశం గురించి కూడా చర్చించాలన్నారు. రెండు దేశాల ప్రజల శాంతి, సౌఖ్యం కోసం కొత్త బంధాలను రచించాలన్నారు.
Received msg from PM Modi: "I extend my greetings & best wishes to the people of Pakistan on the National Day of Pakistan. It is time that ppl of Sub-continent work together for a democratic, peaceful, progressive & prosperous region, in an atmosphere free of terror and violence"
— Imran Khan (@ImranKhanPTI) March 22, 2019