
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా శుక్లాను మోదీ అభినందించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, ఇస్రో తరఫున ఐఎస్ఎస్లో చేపట్టబోయే ప్రయోగాల గురించి మోదీకి శుక్లా బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ ప్రయోగాలు గగన్యాన్కు ఎలా ఉపయోగపడ్తాయో వివరించారు. అనుకున్నది సాధించాలని.. శుక్లాకు మోదీ సూచించారు.
దేశం మొత్తం వెంట ఉంటుందని, అందరి ఆశీర్వాదాలు ఉంటాయని తెలిపారు. శుక్లా ఎంతో ధైర్యవంతుడు అని కొనియాడారు. పేరులోనే ‘శుభ్’ ఉందని.. అంతరిక్ష యాత్ర కూడా సరికొత్త ఆలోచనలు, ఆశయాలకు శుభారంభం కావాలని ఆకాంక్షించారు. స్పేస్లో ఏం.. ఏం చూశావో చెప్పాలని శుక్లాను మోదీ కోరారు. స్పేస్ జర్నీకి తొలుత కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ.. చివరికి అనుకున్నది సాధించానని శుక్లా వివరించారు.
కొద్దిసేపటి కింద ఐఎస్ఎస్ కిటికీ నుంచి చూడగా.. హవాయి మీద ఉన్నట్లు తెలిపారు. భూ కక్ష్య నుంచి రోజుకు 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం చూస్తునట్లు వివరించారు. అభివృద్ధిపరంగా ఇండియా ఎంతో వేగంగా దూసుకెళ్తున్నదని తెలిపారు. మీ ప్రేమ, ప్రజల ఆశీస్సులతోనే తాను ఐఎస్ఎస్లో అడుగుపెట్టినట్లు తెలిపారు. గ్రావిటీ లేకపోవడంతో అక్కడ ఎదురవుతున్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలను మోదీకి వివరించారు. దేశం తరఫున అనుకున్నది సాధించి తిరిగి భూమికి చేరుకుంటానని తెలిపారు.