ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న మోడీ రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభోత్సవంతో పాటు ఎస్బీఐ 50ఏండ్ల వేడుకల్లో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే పీఎంఓ మాత్రం ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదని సమాచారం.
ఇదిలా ఉంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను ప్రారంభించేందుకు ప్రధాని రాష్ట్రానికి వస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ. 6,160 కోట్ల వ్యయంతో 1.27లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కర్మాగార నిర్మాణానికి 2017 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. 2021 మార్చి 23 నుంచి పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. ఈ క్రమంలో నెల చివరలో మోడీ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.