న్యూఢిల్లీ : సర్వీసెస్ సెక్టార్ పనితీరు కిందటి నెలలో మూడు నెలలో గరిష్టానికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితులు బాగుండడంతో పాటు డిమాండ్ కొనసాగడంతో సర్వీసెస్ సెక్టార్ పీఎంఐ డిసెంబర్లో 59 గా రికార్డయ్యింది. అంతకు ముందు నెలలో ఇది 56.9 గా ఉంది. 50 పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. సర్వీస్ సెక్టార్లోని 400 కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఇండియా సర్వీసెస్ పీఎంఐ డేటాను విడుదల చేశామని హెచ్ఎస్బీసీ పేర్కొంది. కిందటి సంవత్సరాన్ని స్ట్రాంగ్ గ్రోత్తో సర్వీసెస్ సెక్టార్ ముగించిందని ఈ సంస్థ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్స్ ఊపందుకోవడంతో కొత్త బిజినెస్లు పెరుగుతున్నాయని అన్నారు.
డిసెంబర్లో ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికాలోని క్లయింట్ల నుంచి ఫుల్ డిమాండ్ కనిపించిందని వెల్లడించారు. వరుసగా 19 వ నెలలోనూ డిమాండ్ పెరిగిందని, కొత్త ఉద్యోగాలు పెరిగాయని ప్రంజుల్ అన్నారు. ఈ ఏడాది కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని, యాడ్స్, కస్టమర్ రిలేషన్షిప్స్ సాయంతో ముందుకు కొనసాగుతామని సర్వీస్ సెక్టార్లోని కంపెనీలు పేర్కొన్నాయి. ఇన్ఫ్లేషన్ ప్రభావం తగ్గిందని, గత మూడున్నరేళ్లలో డిసెంబర్లోనే తక్కువగా ఉందని వెల్లడించారు. ముడిసరుకుల ధరలు కిందటేడాది నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొద్దిగా పెరిగాయని, మరోవైపు కంపెనీలు అమ్మే సర్వీస్ల ధరలు ఎక్కువగా పెరిగాయని హెచ్ఎస్బీసీ పేర్కొంది. పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ డిసెంబర్లో 58.5 గా నమోదయ్యింది.