బాన్స్​వాడ బరిలో ఎవరు?

బాన్స్​వాడ బరిలో ఎవరు?
  • స్పీకర్​గా తనకివి ఆఖరి అసెంబ్లీ సెషన్స్​ అంటూ పోచారం శ్రీనివాస్​ రెడ్డి భావోద్వేగం
  • వచ్చే ఎన్నికల్లో వారసుడిని బరిలో దింపుతారనే ప్రచారం
  • సభలో తానున్నన్ని రోజులు శీనన్న ఉంటారని గతంలో సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలు
  • కామారెడ్డి జిల్లాలో జోరుగా చర్చ

కామారెడ్డి, వెలుగు :  వచ్చే గవర్నమెంట్​లో  కొత్త  స్పీకర్​వస్తారంటూ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి ఎమోషన్​కు గురికావడం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్​రెడ్డి  పోటీచేయకపోవచ్చని, ఆయన తన వారసుడిని బరిలో నిలిపే అవకాశముందని కొద్దిరోజులుగా బాన్స్​వాడ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే అసెంబ్లీ సమావేశాల చివరిరోజైన ఆదివారం ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆయన అనుచరులు అంటున్నారు.  ఈ ఏడాది  మార్చి 1న  బాన్స్​వాడ నియోజకవర్గం తిమ్మాపూర్​లోని  వేంకటేశ్వరస్వామి కల్యాణానికి  సీఎం కేసీఆర్​ వచ్చారు. అక్కడ సీఎం మాట్లాడుతూ..  సభలో తానున్నన్ని  రోజులు శీనన్న బరిలో ఉంటారని , వయస్సు ఏమి అడ్డు రాదని కామెంట్స్​చేశారు. కానీ, పోచారం  శ్రీనివాస్​రెడ్డికి కొంతకాలంగా ఇంటిపోరు ఎక్కువైంది. 

ఆయన ఇద్దరు కొడుకులు  పోచారం భాస్కర్​రెడ్డి, పోచారం సురేందర్​రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలోనే శ్రీనివాస్​రెడ్డి  స్థానంలో ఆయన వారుసుడు బాన్స్​వాడలో  పోటీ చేయవచ్చనే ప్రచారం జరిగింది.  కానీ, కేసీఆర్​మాటలతో ఈ ప్రచారం ఆగిపోయింది.  ప్రస్తుతం పోచారం పెద్దకొడుకు భాస్కర్​రెడ్డి ఉమ్మడి నిజామాబాద్​ డీసీసీబీ చైర్మన్​ గా ఉన్నారు. ఈసారి ఆయనకే టికెట్​ఇప్పించాలని ఫ్యామిలీ మెంబర్స్​ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

వయసురీత్యా తన వారసుడిని బరిలో కి దింపాలని శ్రీనివాస్​రెడ్డి భావిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల  సీఎంను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కొడుకుకు టికెట్​ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు కేసీఆర్​సర్వే శ్రీనివాస్​రెడ్డికి  అనుకూలంగా ఉందని, ఆయన కొడుకులకు నియోజకవర్గంలో నెగెటివ్​ఉందని, అందుకే సీఎం హామీ ఇవ్వలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది.  ఈ క్రమంలో అసెంబ్లీ  సమావేశాల్లో ఆదివారం పోచారం తన మనుసులో మాటను ఈ విధంగా బయటపెట్టినట్లు ఆయన వర్గీయులు భావిస్తున్నారు.