- ఫొటో, వీడియోల ఆధారంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్న పోలీసులు
- మరోసారి బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న అధికారులు
- బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో మరో మైనర్ అరెస్ట్
- ఇన్నోవాను ఫాం హౌస్కు తీసుకెళ్లిన కార్పొరేటర్కు నోటీసులు
- బెంజ్ కారులో బాలిక చెప్పులు, చెవి రింగు లభ్యం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో బాలికపై గ్యాంగ్రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుపైనా కేసు పెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటపెట్టిన ఫొటోలు, వీడియో ఆధారంగా బెంజ్ కారులో బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆధారాలను సేకరించారు. దాంతో పాటు బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ఇచ్చే సమాచారం, ఫొటో, వీడియో ఆధారాల ప్రకారం ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆదివారం సంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మైనర్(17)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత గుల్బర్గా వెళ్లిపోయిన అతడిని శనివారం రాత్రి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టి జువనైల్ హోంకు తరలించారు. మరో నిందితుడు ఉమేర్ ఖాన్ను విచారిస్తున్నారు. పబ్ నుంచి బేకరీకి వెళ్లే మార్గంలో బెంజ్ కారులో, బేకరీ నుంచి పబ్కు వచ్చేటప్పుడు ఇన్నోవాలో జరిగిన ఘటనల వివరాలను రికార్డ్చేశారు. ఇన్నోవాను మొయినాబాద్ఫాం హౌస్కు ఓ కార్పొరేటర్ తరలించినట్టు తెలుసుకుని.. అతడికి నోటీసులిచ్చారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇటు అమ్నీషియా పబ్ సిబ్బందిని కూడా విచారించారు. ఈవెంట్ నిర్వహించిన వారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు.
కార్లలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ
సీజ్ చేసిన బెంజ్, ఇన్నోవా కార్లలో ఆదివారం ఫోరెన్సిక్, క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. బెంజ్ కారులో బాధిత బాలిక చెప్పులు, చెవికమ్మ, వెంట్రుకలు, వేలి ముద్రలు సహా 15 రకాల క్లూస్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీకి తరలించారు. ఇన్నోవాలోని సీట్ల మధ్యలో 20 రకాల క్లూస్ను తీసుకున్నారు. వాటితో పాటు నిందితుల మొబైల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు, ఫొటోలను ఎవరు షేర్ చేశారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.