హోటల్స్లో ఖైదీల సరసాలు : లంచం తీసుకున్న కానిస్టేబుళ్లు సస్పెండ్

హోటల్స్లో ఖైదీల సరసాలు : లంచం తీసుకున్న కానిస్టేబుళ్లు సస్పెండ్

సినిమాల్లో కరుడుగట్టిన ఖైదీలు ఎలా ఉంటారో అందరికీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. వారిని చూస్తే జైలు అధికారులే వణికిపోవటం.. నాయకుల సపోర్ట్ తో వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం.. సుక్క, ముక్క, పక్కా.. ఇలా నచ్చింది అరేంజ్ చేయడం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడు సెంట్రల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సైతం అందుతున్నాయి. అదేదో టెక్నాలజీ లేనప్పుడు కాదు.. సోషల్ మీడియా.. సీసీ టీవీలు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా అలాంటి వ్యవహారాలు జరగటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ALSO READ | బెంగుళూర్‎లో రేవ్ పార్టీ భగ్నం.. 31 మంది అరెస్ట్.. సగం మంది ఐటీ ఉద్యోగులే..!

శిక్ష పడి జైలులో చిప్పకూడు తినాల్సిన ఖైదీలు.. ఎంచక్కా హోటల్ బుక్ చేసుకుని.. గర్ల్ ఫ్రెండ్స్ తో సరసాలు.. సల్లాపాలతో ఒక రోజంతా ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.  హాస్పిటల్ విజిట్ కోసమని వెళ్లి.. ఎంచక్కా టీ, టిఫిన్, మందు, డ్రగ్స్, గర్ల్ ఫ్రెండ్.. ఇలా గ్యాంగ్ స్టర్స్ చేసినట్లుగా సాధారణ ఖైదీలు  ఎంజాయ్ చేయడం రాజస్థాన్ లో సంచలనం సృష్టించింది. జైళ్లలో ఇలా కూడా జరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఈ న్యూస్ వింటే ఇంత ఈజీగా మేనేజ్ చేయవచ్చా అనే కామన్ క్వశ్చన్ సగటు ఖైదీల్లో కలగక మానదు.


వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ జైపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు.. ఒకరోజు ఎంచక్కా సిటీ టూర్ వేయడం సంచలనం సృష్టించింది. మొత్తం 5 మంది ఖైదీలలో నలుగురు ఒక రోజంతా ఎంజాయ్ చేసి వచ్చారు. అందులో ఒకరు గర్ల్ ఫ్రెండ్ తో, మరొకరు భార్యతో హోటల్ లో గడపటం దేశ వ్యాప్తంగా డిబేట్ కు కారణమైంది. 

ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు ఆదివారం (మే 25) అరెస్టు చేశారు. అందులో నలుగురు ఖైదీలు, నలుగురు వారి రిలేటివ్స్, ఐదుగురు పోలీసులు ఉన్నారు. పోలీసులకు లంచం ఇచ్చి ఒకరోజు ఫ్రీడమ్ టూర్ కింద రోజంతా ఎంజాయ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

రఫీక్ బక్రీ, భన్వర్ లాల్, అంకిత్ భన్సల్, కరణ్ గుప్తా అనే నలుగురు ఖైదీల జైపూర్ లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్ లో మెడికల్ చెకప్ కోసం బయటకు తీసుకెళ్లారు. అయితే రోజంతా లీజర్ ఉండేలా పోలీసులకు లంచం ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. దీంతో ఐదు మందిలో ఒకరు మాత్రమే ఆరోజు హాస్పిటల్ లో చెకప్ కు వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు. శనివారం (మే 24) సాయంత్రం 5.30 గంటల వరకు కూడా నలుగురు రాకపోవడం అనుమానాలకు దారితీసింది. 

ఖైదీలను ఔటింగ్ కు తీసుకెళ్లేందుకు పోలీసులు మొత్తం 25 వేల రూపాయలకు సెటిల్ చేసుకున్నారు. ఒక్కో పోలీసుకు 5 వేలు ఇవ్వనున్నట్లు మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదిరిందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఆఫీసర్ తెలిపారు. 

ఈ ఖైదీలలో రఫీక్ తన భార్యను, భన్వర్ లాల్ తన ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ ను జలుపుర హోటల్ కలుసుకున్నారు. డే అంతా హోటల్ లో స్పెండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరో విషయం ఏంటంటే.. రఫీక్ భార్య నార్కోటిక్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. అంటే డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావటంతో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తేజశ్విని గౌతమ్ తెలిపారు. 

ఇక అంకిత్, కరణ్ అనే ఇద్దరు ఖైదీలు ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లోని హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ గా పోహా (అటుకులతో చేసిన టిఫిన్) తీసుకున్నట్లు సీసీటీవీ విజువల్స్ ద్వారా గుర్తించారు. వీళ్లిద్దరికీ ఆ హోటల్ రూమ్ బుక్ చేసింది అంకిత్ గర్ల్ ఫ్రెండ్. 

ఆ తర్వాత దర్యాప్తులో హోటల్ లో 45 వేల రూపాయలతో కరణ్ రిలేటివ్స్ పట్టుబడటం చూసి పోలీసులు షాక్ కు గురయ్యారట. ఖైదీల ఐడీ కార్డ్స్ తో డబ్బులు క్యారీ చేయడం చూస్తుంటే.. ఏదో పెద్ద ప్లానే వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఖైదీలకు ఔటింగ్ ఏర్పాటు చేసింది జైలులో ఉన్న ఒక సీనియర్ అధికారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ నెలలో మొత్తం 200 ఫోన్ కాల్స్ జైలు అధికారి మాట్లాడినట్లు గుర్తించారు. లంచం ఒప్పందం చేసుకోవడం, ఖైదీలకు మొబైల్ ఫోన్లు అదించడం, వీఐపీలకు ఫోన్లు చేసి భయపెట్టడం వీళ్ల మాస్టర్ మైండ్స్ లో భాగమేనట. ఇది ఎంత వరకు వచ్చిందంటే చివరికి సీఎంను కూడా టార్గెట్ చేస్తామని బెదిరించే వరకు వెళ్లింది వీళ్ల అరాచకం. 

దీనిపై సవయ్ మన్ సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇలాంటి నెట్ వర్క్ గురించి తెలుసుకునేందుకు సెంట్రల్ జైల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. సీఎం ను బెదిరించే వరకు వీళ్లు వెళ్లారంటే.. తీగలాగితే డొంక కదిలినట్లుగా.. పెద్ద కుట్ర బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.