దేశంలో పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు డంపింగ్ యార్డుల్లా మారాయని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఉన్న అన్ని పోలీస్ అకాడమీ నుండి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రైనింగ్ సెంటర్ లలో శిక్షణ తీసుకున్న అధికారులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రజల కోసం పోలీసులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారని, కానీ ఎక్కడా ప్రజల నుండి గుర్తింపు రావడంలేదన్నారు. దానికి కారణం శిక్షణ లోపమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకుల ఆచారం ఇంకా పోలీస్ శాఖలో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.
జైళ్లలో మగ్గుతుందని 90 శాతం పేదవాళ్లే
తినడానికి తిండిలేని 90శాతం మంది పేదవారు జైళ్లలో మగ్గుతున్నారని అన్నారు. వారిలో కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో..? ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్ కి వచ్చామో కూడా తెలియదన్నారు. పోలీస్ అకాడమీ లో ప్రయోగాలు చేయడం ఎంతైనా అవసరం ఉందన్న ఆయన..పోలీసులు సామాజిక కార్యకర్తల్లా పనిచేయాలని సూచించారు. పోలీస్ అకాడమీ లు స్కూలు, కాలేజీలు కావని ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలో శిక్షణలో ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 24 న ప్రారంభం అయ్యే కొత్త బ్యాచ్ శిక్షణకు అకాడమీలో నూతన పద్దతుల్ని అమలు చేస్తామన్నారు. పోలీస్ ఆఫీసర్ అంటే బిల్డర్ కావాల్సిన అవసరం లేదని.. వికలాంగుడైనా పోలీస్ కావొచ్చన్నారు. సీఐ నుండి ఎస్పీ వరకు గ్రౌండ్ లెవల్లో పని చేసే తీరుపైన అబ్జర్వేషన్ చేసి రిపోర్ట్ రాష్ట్ర డీజీపీ కు నివేదిక ఇస్తామని , దాని ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అవినీతి లో దేశంలో తెలంగాణ 3వ స్థానం లో ఉంది అని ఒక సర్వే చెప్పిందని.. ఆ సర్వే తనని ఎంతగానో బాధించిందని వీకే సింగ్ తెలిపారు.