
- రాష్ట్రంలో నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ఫోర్స్ కమిటీలు
- అయినా ఆగని అక్రమ దందా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందుల దందా రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. గత కొన్నేండ్లుగా సీజన్కు ముందే నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున దొడ్డిదారిని రాష్ట్రంలోకి ప్రవేశించి అమాయక రైతులను ఆగం చేస్తున్నాయి. దీనికి తోడు ఈ అక్రమ దందాకు వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ, ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని కొందరు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు (ఏవో, ఏఈవోలు) ఈ నకిలీ ముఠాతో జట్టు కట్టి రైతులను మోసం చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన పురుగుమందుల వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంట దిగుబడి తగ్గడం, పెట్టుబడి అప్పులు తీర్చలేక రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నాయి.
తాజాగా వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ అనుమతి, సర్టిఫికెట్ లేకుండా విక్రయిస్తున్న రూ.1.12 కోట్ల విలువైన నకిలీ పురుగుమందులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన మరో ఆపరేషన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన పురుగు మందులు, గడ్డిమందు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ.63.62 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, పురుగుమందులను స్వాధీనం చేసుకున్నారు. పరకాల, నర్సంపేట, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ డివిజన్లలో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నట్టు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది.
డిమాండ్ ఉన్న విత్తనాలపై అక్రమార్కుల నజర్..
ప్రధానంగా నకిలీ విత్తన ముఠాలు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పత్తి, మిరప, వరి విత్తనాలను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయించి భారీ రైతులను దోచుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్లో పత్తి, మిరప డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ ముఠాలు ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు తయారు చేసి, రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని వివిధ దుకాణాల ద్వారా రైతులకు అమ్ముతున్నారు. ఈ దందాలో ప్రముఖ డీలర్లు తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అక్రమార్కులకు వ్యవసాయ అధికారుల సహకారం
ఈ నకిలీ విత్తనాల దందాకు వ్యవసాయ శాఖలోని కొందరు క్షేత్రస్థాయి అధికారులు సహకరిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అధికారులు ఏండ్లకు ఏండ్లుగా అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లతో అంటకాగుతూ, ఈ అక్రమాలకు మామూళ్లు దండుకుంటున్నట్టు విజిలెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ అధికారుల సహకారం లేకుండా ఈ దందా ఇంత విస్తృతంగా సాగడం సాధ్యం కాదని తెలుస్తున్నది. ఈ దందాకు సంబంధించి రెండు వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు సభ్యులను వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో నకిలీ విత్తనాలపై ప్రత్యేకంగా వేసిన విజిలెన్స్ టాస్క్ఫోర్స్ టీంలు అధికారులు నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలపై దృష్టి పెట్టాయి.
ముందస్తు చర్యలు అవసరం
నకిలీ విత్తనాలు, పురుగుమందుల దందా రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖలో అవినీతిని నిర్మూలించి, నాణ్యమైన విత్తనాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కఠిన నిఘాను అమలు చేయడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నారు. రైతుల ఆర్థిక భద్రత, వ్యవసాయ రంగం సుస్థిరత కోసం ఈ అక్రమాలను అరికట్టడం అనివార్యమని రైతు సంఘాలు పిలుపునిస్తున్నాయి. వ్యవసాయ శాఖలోని కొందరు అధికారుల సహకారంతో ఈ దందా కొనసాగుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. విజిలెన్స్, పోలీసు శాఖలు ఈ అక్రమాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.