- డేవిడ్ ఉకా అరెస్ట్..264 ఎక్స్టసీ పిల్స్ సీజ్
- వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: పాస్టర్ ముసుగులో హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్ డేవిడ్ ఉకా(58)ను టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీన్యాబ్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10.56 లక్షల విలువ చేసే 264 ఎక్స్టసీ(డ్రగ్) పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురువారం మీడియాకు వివరించారు. నైజీరియా దేశానికి చెందిన డేవిడ్ హుకా 2013లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడు. ఢిల్లీలో కొంతకాలం షెల్టర్ తీసుకున్నాడు. వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా బెంగళూరుకు మకాం మార్చాడు. అక్కడ పేరు మార్చుకుని, ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు.
హైదరాబాద్లో డ్రగ్స్ నెట్వర్క్
బెంగళూరులో ఆల్ ఇండియా నైజీరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోసియేషన్ను ఏర్పాటు చేసిన డేవిడ్ ఉకా.. దానికి చైర్మన్ గా వ్యవహరించడంతో పాటు పాస్టర్ గా చలామణి అయ్యాడు. దీని ద్వారా డ్రగ్స్, గంజాయి కేసులో అరెస్టయిన నైజీరియన్లకు బెయిల్ ఇప్పించి వాళ్ల దేశానికి పంపిస్తున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరులోని నైజీరియన్ స్టూడెంట్స్, టూరిస్ట్, హెల్త్ వీసాలపై వచ్చిన వారికి అవసరమైన సహాయం చేసేవాడు. సాయం పొందినవారితో సోషల్మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు. పెడ్లర్లు, కస్టమర్లతో అతనే కాంటాక్ట్లో ఉండేవాడు. ఫేక్ ఐడీలతో ఫోన్స్ కొని ఇంటర్నేషనల్, వాట్సాప్ కాల్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకునేవాడు. బెంగళూరులోని బేదరకల్లి షెల్టర్ నుంచి హైదరాబాద్లోని పెడ్లర్లకు డ్రగ్స్ అందించేవాడు.
ఎట్ల దొరికిండు?
గత నెల 7న ఫిలింనగర్ ఏరియాలో డేవిడ్ ఉకా నెట్వర్క్లోని ఆరుగురు నైజీరియన్లను టీన్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ.కోటి విలువ చేసే 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎమ్డీఎమ్ఏ స్వాధీనం చేసుకున్నారు. వారి వాట్సాప్ చాటింగ్, కాల్డేటా ఆధారంగా డేవిడ్ ఉకాను గుర్తించారు. బెంగళూరులో డేవిడ్ ఉకా నివాసం ఉండే ఏరియాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అతను హైదరాబాద్కు వస్తున్నట్లు గుర్తించారు. బుధవారం ఎక్స్టసీ డ్రగ్స్ పిల్స్ సప్లయ్ చేసేందుకు వచ్చిన డేవిడ్ ఉకాను పోలీసులు ఫిల్మ్నగర్లో అరెస్ట్ చేశారు.264ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. డేవిడ్ ఉకాను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఎఫ్ఆర్ఆర్, ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి నైజీరియన్స్ సహా సిటీలో ఓవర్ స్టేయర్స్ వివరాలు సేకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తిగా అరికడతామని పేర్కొన్నారు.