- డ్రగ్స్ పార్టీల కోసంయూపీ, గోవాకు
- డ్రగ్స్ కన్జ్యూమర్లుగా సినీ ప్రముఖులు, మోడల్స్
- 43 మంది అనుమానితులను గుర్తించిన టీ న్యాబ్
- నేడు మరో ముగ్గురిని విచారించనున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా నవదీప్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మోడల్స్, పలువురు జూనియర్ ఆర్టిస్టులు డ్రగ్స్ కన్జ్యూమర్లుగా మారినట్లు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) గుర్తించింది. దాదాపు 43 మంది అనుమానితుల ట్రాక్ రికార్డ్ను సేకరిస్తున్నది. హైకోర్ట్ ఆదేశాలతో హీరో నవదీప్ను 41ఏ సీఆర్పీసీ ప్రకారం శనివారం టీ న్యాబ్ విచారించింది. ఎస్పీ సునీతా రెడ్డి టీమ్ దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణలో డ్రగ్స్ పెడ్లర్స్ నెట్వర్క్లో ఉన్న ప్రముఖుల గురించి వివరాలు సేకరించింది. డ్రగ్స్ సప్లయర్ బాలాజీ, హీరో నవదీప్ ఫ్రెండ్ రామ్చంద్, నవదీప్ కాల్డేటా ఆధారంగా వివరాలు రాబడుతున్నది.
గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సప్లై
సినీ ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్కు బానిసలైనట్లు టీ న్యాబ్ టీమ్ గుర్తించింది. కొంత మంది ప్రముఖులకు యూపీలోని కోసల, గోవాలోని డ్రగ్ పెడ్లర్లతో లింకులు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. డ్రగ్స్ పార్టీల కోసం కోసల, గోవాకు వెళ్తున్నారని నవదీప్ తన విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గోవా డ్రగ్ పెడ్లర్స్ హైదరాబాద్కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు టీ న్యాబ్ అనుమానిస్తున్నది. నవదీప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అనుమానితుల డేటా సేకరిస్తున్నది. స్నార్ట్ పబ్ ఓనర్ సూర్యపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. మరికొంత మంది పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కలహర్ రెడ్డితోప్రముఖుల సంబంధాలు
ఈవెంట్స్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య, హిటాచి సాయి మంగళవారం విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఈ ముగ్గురు గుడిమల్కాపూర్ పోలీసులకు డాక్యుమెంట్స్ అందించనున్నారు. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా టీ న్యాబ్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. ఇందులో కలహర్ రెడ్డికి చాలా మంది సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. బెంగళూర్, విశాఖలో కలహర్ రెడ్డి పలు ఈవెంట్స్ నిర్వహించినట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లై చేశాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.