- పోలీస్స్టేషన్ ముందు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం
- ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడనే టార్గెట్ చేశారని బాధితుడి ఆరోపణ
- సీఐ హామీతో ఆందోళన విరమణ
అచ్చంపేట, వెలుగు : ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకుంటావా అని బెదిరిస్తూ పోలీసులు తనను చితకబాదారని చేదురుబావి తండాకు చెందిన ఓ వార్డు మెంబర్ ఆదివారం కుటుంబంతో కలిసి అచ్చపేట పోలీస్స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీకి రాజీనామా చేయాలని బెదిరించారని, లేకపోతే చంపుతామన్నారని వాపోయాడు. బాధితుడి కథనం ప్రకారం..అచ్చంపేట మండలం చేదురుబావితాండాకు చెందిన 8వ వార్డు మెంబర్ కేతావత్ మత్రూ నాయక్ మూడు నెలల కింద నిర్వహించిన ఓ క్రికెట్టోర్నమెంట్లో ఎమ్మెల్యే టీమ్ ఓడిపోతే ఈలలు, కేకలతో సంబురాలు చేసుకున్నాడు.
అప్పుడే ఎమ్మెల్యే అనుచరులు పక్కకు తీసుకెళ్లి చేయి చేసుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారని టార్గెట్ చేశారు. హోలీ పండుగ రోజు అచ్చంపేటలో బైక్పై వెళ్తుండగా ఏఎస్ఐ అంజయ్య, కానిస్టేబుల్రాంబాబులు పట్టుకుని ‘ ఏం రా ఎక్కువ చేస్తున్నావ్. ఎమ్మెల్యేతోనే గొడవ పెట్టుకుంటవా? కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరు. లేదంటే చచ్చిపోతావు’ అని వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ వెహికల్లో సీట్ల కింద కుక్కి పీఎస్కు తీసుకువెళ్లి విపరీతంగా కొట్టారు. కాళ్లు మొక్కుతానన్న వదిలి పెట్టలేదు. మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు. కొద్దిసేపటికి వదిలిపెట్టగా మాజీ ఎంపీపీ రామనాథం ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు.
ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి ప్రశ్నించగా కానిస్టేబల్ను తిట్టడంతోనే తీసువచ్చామని ఎస్ఐ సమాధానం ఇచ్చారు. అయితే, తనను అన్యాయంగా కొట్టారని ఆదివారం అచ్చంపేట పోలీస్ స్టేషన్ ముందు మత్రూనాయక్ కుటుంబంతో సహా ధర్నా కు దిగాడు. పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ అనుదీప్ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మత్రూనాయక్కు మద్దతుగా కాంగ్రెస్ లీడర్లు నర్సయ్య యాదవ్, రామనాథం, గోపాల్ రెడ్డి, గౌరీశంకర్, ఖాదర్, మహబూబ్అలీ, అంజనేయులు ఆందోళనలో పాల్గొన్నారు.