ప్రగతి భవన్‌‌‌‌ను పోలీసులే ముట్టడించారు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రగతి భవన్‌‌‌‌ను పోలీసులే ముట్టడించారు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: యూత్ కాంగ్రెస్ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడిని పోలీసులే సక్సెస్ చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం జగిత్యాలలోని ఇందిరా భవన్‌‌‌‌లో  మీడియాతో మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ లీడర్లను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో లోపాలను సవరించాలని చేపట్టాలని డిమాండ్​చేశారు. ఫిజికల్ టెస్టుల్లో రన్నింగ్, లాంగజంప్, షాట్​పుట్​పెంచడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. దేశంలో ఏ రాష్ట్రంలో, ఆర్మీలో కూడా లేని రూల్స్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అభ్యర్థులు కోరేది సడలింపులు కాదని, గతంలో ఏవిధంగా నిర్వహించారో ఆదే విధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మార్చిలో టెట్​నిర్వహించి నేటికీ టీచర్​పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు గిరి నాగభూషణం, బండ శంకర్, రాజేందర్, దుర్గయ్య, మోహన్, రాజేందర్, మధు, జీవన్, రాజేశ్​ పాల్గొన్నారు. 

కాంగ్రెస్​ నాయకుల అరెస్టు

జమ్మికుంట, వెలుగు: ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరేందుకు రెడీ అయిన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాంగ్రెస్​ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి నిరుద్యోగులను మోసం చేస్తూ వారి బతుకులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. లీడర్లు శివకుమార్ గౌడ్, రాకేశ్​ముదిరాజ్, రవి, వినోద్, నయీం, ప్రణయ్, ఇమ్రాన్ లతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా! 

వేములవాడ, వెలుగు:  ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే ప్రతిపక్షాల నాయకులను అరెస్టులు చేస్తారా, మీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్​ ఫైర్​ అయ్యారు. చలో ప్రగతిభవన్ కు వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని  పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించగా వారికి శ్రీనివాస్​ సంఘీభావం తెలిపారు.