- గ్రేటర్ సిటీలో వరుస నేరాలు చేస్తున్న వారిపై నిఘా
- నిందితులైన రౌడీ షీటర్లను గుర్తించి వార్నింగ్
- కుటుంబ సభ్యుల సమక్షంలోనూ కౌన్సిలింగ్
- బైండోవర్ చేస్తున్న మూడు కమిషనరేట్ల సీపీలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లు, రియల్టర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సిటీలో జరిగే నేరాల్లో ఎక్కువగా రౌడీ షీటర్లే నిందితులుగా ఉంటున్నారు. మర్డర్లు, హత్యాయత్నాలు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని దాడులకు దిగుతున్నారు. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మూడు కమిషనరేట్లలోని సీపీలు.. డీసీపీలతో కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే రౌడీ షీట్స్ ఆధారంగా నిందితులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
సౌత్ జోన్ పరిధిలోనే ఎక్కువగా..
2022తో పోల్చితే 2023లో మూడు కమిషనరేట్లలో క్రైమ్ రేట్ పెరిగింది. కిడ్నాప్స్, మర్డర్స్, దాడులు, చొరబాటు, బెదిరింపుల కేసుల్లో రౌడీ షీటర్ల జోక్యం ఎక్కువైనట్టు తేలింది. దీంతో రౌడీషీటర్లను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ తో పాటు వార్నింగ్ ఇస్తున్నారు.
మళ్లీ నేరాలు చేస్తే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని, ఏడాది పాటు జైళ్లలో పడేస్తామని హెచ్చరిస్తున్నారు. సిటీలో మొత్తం 1,655 మంది రౌడీషీటర్లు ఉండగా సౌత్ జోన్ పరిధిలో అధికంగా 502 మంది ఉన్నారు. ఇందులో భాగంగా సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఓల్డ్ సిటీపై ఫోకస్ చేశారు. రౌడీ షీటర్లలో మార్పు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ముగ్గురు కమిషనర్లు వరుసగా కౌన్సిలింగ్ లు
ఇప్పటికే మూడు సార్లు రౌడీ షీటర్లకు సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. సిటీలోని 7 జోన్ల పరిధిలోని రౌడీషీటర్లను దశలవారీగా స్టేషన్ కు పిలుస్తున్నారు. మళ్లీ ఎలాంటి నేరాలు చేయబోమంటూ రౌడీషీటర్లు హామీ ఇవ్వడమే కాకుండా వారి వద్ద పోలీసులు సెక్యూరిటీ బాండ్లు, పూచీకత్తులు కూడా తీసుకుంటున్నారు. ఇదే తరహాలో రాచకొండ,సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని రౌడీ షీటర్లకు ప్రతి నెలలో మూడుసార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
స్పెషల్ బ్రాంచ్ ద్వారా ప్రత్యేక నిఘా పెడుతున్నారు. పూర్తిగా మారిన వారిపై రౌడీ షీట్ తొలగించేందుకు చర్యలు తీసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రౌడీ షీటర్లను బైండోవర్ చేసినది తెలిసిందే. ఎవరెవరిపై కేసులు నమోదైన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.