
తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చకు దారితీసిన.. మెడికోప్రీతి ఆత్మహత్యకేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.కులం పేరుతో దూషించినందువల్లే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పేర్కొన్న పోలీసులు.. సైఫ్ వేధింపులే అందుకు ప్రధాన కారణమని 970 పేజీలతో కూడిన ఛార్జిషీట్లో ప్రస్తావించారు.
కులం పేరు ప్రస్తావించడంతో పాటు ర్యాగింగ్ చేయడంతో.. ప్రీతి డిప్రెషన్కు లోనై, ఆత్మహత్య చేసుకుందని చార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారు. ప్రీతి 2022 నవంబర్లో కేఎంసీలో జాయిన్ అయినప్పటి నుంచి సైఫ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. కులం పేరుతో హేళన చేస్తూ.. ప్రీతిని సైఫ్ దూషిస్తూ వచ్చాడు. అది ఆమె భరించలేకపోయింది. మానసికంగా ఇబ్బందికి గురయ్యింది. ఆ వేధింపులు భరించలేక.. ప్రీతి ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 08.10 గంటలకు ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన నిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూసింది అని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో(పీజీ) చదువుతున్న ధారవత్ ప్రీతి నాయక్.. సీనియర్ సైఫ్ నుంచి వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను హైదరాబాద్ నిమ్స్కు తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్కు గురై కన్నుమూసింది.
970 పేజీలతో చార్జ్ షీట్
ఈ కేసులో 70 మంది సాక్షులను విచారించి.. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు, నిందితుడు, వారి మిత్రులు వాడిన సెల్ఫోన్ల డేటాను వెలికి తీసి.. మృతురాలు మరణంపై కేసుకు సంబందించిన అన్ని రకాల సాక్ష్యధారాలు సేకరించి.. అన్ని పరిశీలించిన తర్వాత విచారణలో మెడికో ప్రీతిని డాక్టర్ ఎంఏ సైఫ్ ర్యాగ్గింగ్ పేరుతో వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడని రుజువు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలతో కలిపి, 970 పేజీలతో కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ కేసులో మొత్తం 70 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. అలాగే.. సైఫ్ వేధింపులే కారణమని ఛార్జిషీట్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రీతి, సైఫ్ సెల్ఫోన్ ఛాటింగ్లను సైతం ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ‘‘ప్రీతి మృతిపై U/s.306, 354 IPC, Sec .4(v) TS Prohibition of Ragging Act, Sec.3(1)(r), 3(1)(w)(ii), 3(2)(v) SC/ST (POA) Act క్రింద మట్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సైంటిఫిక్ , టెక్నికల్ , మెడికల్ , ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు(బాధితురాలు).. నిందితుడు, వాళ్ల వాళ్ల మిత్రులు వాడిన సెల్ ఫోన్ డాటా వెలికి తీసి సాక్ష్యాధారాలు సేకరించాం. ప్రీతీని పలు రకాలుగా ర్యాగ్గింగ్ పేరుతో వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా సైఫ్ ప్రేరేపించారని ఆధారాలతో సహా చార్జిషీట్ దాఖలు చేశాం అని ప్రకటించారు సీపీ రంగనాథ్.
ప్రీతి మృతిపై అనేక అనుమానాలు, ఆందోళనలు వక్తమైన నేపథ్యంలో.. పోలీసులు ఈ రూమ్ని సీజ్ చేసి, విచారణ చేపట్టారు. అయితే.. ఇప్పుడు కేఎంసీకి కొత్త విద్యార్థులు వస్తుండటంతో, ప్రీతి రూమ్ ఖాళీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో.. ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ పోలీసులను ఆశ్రయించి.. వారి సమక్షంలో ప్రీతి రూమ్ ఓపెన్ చేశారు. ప్రీతికి చెందిన స్టడీ మెటీరియల్స్తో పాటు మెడిసిన్, ఇతర సామాగ్రిని తీసుకెళ్ళారు. ప్రీతి మృతితో ప్రభుత్వం ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. ఆమె సోదరికి ఉద్యోగం కూడా కల్పించింది.