హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శనివారం ‘పోలీస్ ఫ్లాగ్ డే’ను నిర్వహించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు.అమరులైన పోలీసుల సేవలను వారు గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశ సరిహద్దు భద్రత బాధ్యత సైనికులది కాగా.. దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు దేశంలో 264 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. రాచకొండ పరిధిలో 16 మంది మరణించారని ఆయన గుర్తు చేశారు.