హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ మీటింగ్స్, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనతో హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓవైపు అగ్నిపథ్ నిరసనలు మరోవైపు కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ ఆందోళనల మధ్య జరుగుతున్న పీఎం టూర్కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు స్టాండ్ టులోకి వచ్చారు. జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలను రప్పించారు. బందోబస్తుపై డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. హనుమకొండలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య దాడులతో మరింత అలర్ట్ అయ్యారు. పోలీసుల సూచనలతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. హెచ్ఐసీసీ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ను సీపీలు స్టీఫెన్ రవీంద్ర, సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ఈ రెండు రోజుల సెక్యూరిటీని చాలెంజ్గా తీసుకున్నారు.హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను ఎస్పీజీ ఇప్పటికే తన అధీనంలోకి తీసుకుంది. సీఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించింది. పీఎం భద్రతలో స్నైపర్ షూటర్లను ఏర్పాటు చేసింది. హెచ్ఐసీసీతో పాటు పరిసర ప్రాంతాల్లో 3 వేల మంది పోలీసులను మోహరించారు. మూడు ఎంట్రీస్ వద్ద డీసీపీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నారు. ఎంట్రన్స్లో మెటల్ డిటెక్టర్లు, బాంబ్, డాగ్స్క్వాడ్లతో నిరంతరం చెక్ చేస్తున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్, పరేడ్ గ్రౌండ్స్ భద్రతా ఏర్పాట్లను సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు.
సిన్హా పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు
(ఉదయం11 నుంచి 2 గంటల వరకు)
1. గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్భవన్ రోడ్లో వెళ్లే ట్రాఫిక్ మొనప్ప, రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లాలి.
2. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్రోడ్ వైపు ట్రాఫిక్ కు అనుమతి లేదు. ఖైరతాబాద్ జంక్షన్, షాదన్ కాలేజ్ మీదుగా ట్రావెల్ చేయాలి.
3. మినిస్టర్స్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ రూట్లో ట్రాఫిక్ ను అనుమతించరు. ఈ ట్రాఫిక్ ను బుద్ధభవన్, ట్యాంక్బండ్ మీదుగా డైవర్ట్ చేస్తారు.
4. ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే ట్రాఫిక్ సోనాభాయ్ మసీద్, కర్బలా మైదాన్ మీదుగా ట్రావెల్ చేయాలి.
5. మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోడ్ రూట్లో వెళ్లే వాహనాలు ఖైరతాబాద్ రూట్లో వెళ్లాలి.