హోంగార్డులకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు

హోంగార్డులకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు

హైదరాబాద్ : హోంగార్డు రవీందర్​ఆత్మహత్య నేపథ్యంలో నిరసన తెలిపిన అతని సహచరులపై పోలీసు ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిరసనలు, ఆందోళనలు చేసిన 15 మంది హోంగార్డులకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. దీనిపై హోంగార్డుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోని అధికారులు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగటాన్ని వాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. 

మరోవైపు.. హెంగార్డులకు నోటీసులు ఇవ్వడంపై హోంగార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీందర్ ఆత్మహత్యకు కారణమైన ఏఎస్సై, కానిస్టేబుల్​పై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఇక, రవీందర్​ భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వలేదంటున్నారు.

చాంద్రాయణగుట్ట ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో హోంగార్డుగా పని చేస్తున్న రవీందర్​సెప్టెంబర్ మొదటి వారంలో గోషామహల్​లోని హోంగార్డు కమాండెంట్​కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు పర్మినెంట్​ చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటంతో అప్పటికే తీవ్ర మానసిక వేదనతో ఉన్న రవీందర్​ రెండు నెలలపాటు జీతం కూడా ఆగిపోవటంతో విషయం కనుక్కుందామని హోంగార్డు కమాండెంట్​ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఏఎస్సై నర్సింగ్, కానిస్టేబుల్​చందు దురుసుగా ప్రవర్తించారని బయటకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. 55శాతం కాలిన గాయాలకు గురైన అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత రవీందర్​ను కాంచన్​బాగ్​ డిఫెన్స్​ రోడ్డులోని అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా నిరసన ప్రదర్శనలు చేశారు హోంగార్డులు. 

రవీందర్​మరణించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పించటానికి హోంగార్డులు సిద్ధమైనపుడు కూడా పోలీసు ఉన్నతాధికారులు వారిని అడ్డుకున్నారు. ఎలాంటి కార్యక్రమం జరిపినా ఉద్యోగం ఊడినట్టే అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అన్ని పోలీస్​స్టేషన్ల ఇన్​ఛార్జీలకు డ్యూటీలో ఉన్నా, లేకపోయినా అందరు హోంగార్డులు పోలీస్​ స్టేషన్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మెసేజీలు సర్క్యులేట్​ చేశారు. ఆదేశాలు పాటించని వారి జాబితా తయారు చేసి పంపించాలని సూచించారు. 

ఉస్మానియా ఆస్పత్రి వద్ద హోంగార్డులు జరిపిన ఆందోళనకు సంబంధించి అఫ్జల్​గంజ్​పోలీస్​స్టేషన్​లో అధికారులు ఒక ఎఫ్ఐఆర్​ జారీ చేసినట్టు తెలిసింది. అపోలో ఆస్పత్రి వద్ద నిర్వహించిన నిరసనలపై కాంచన్​బాగ్​ పోలీసులు 2 ఎఫ్ఐఆర్​లు రిజిష్టర్​ చేసినట్టు సమాచారం. ఈ మూడింటిలో పలువురిని నిందితుల జాబితాలో చేర్చినట్టు తెలియవచ్చింది. ప్రస్తుతం ఈ 3 ఎఫ్ఐఆర్​లలో ఉన్న వారిలో దాదాపు 15 మందికి పోలీసు అధికారులు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది.