
- సైబరాబాద్ ఏఆర్ డీసీపీ, ఎస్ఐబీ మాజీ ఏఎస్పీ కొడుకుల అరెస్ట్
- డ్రగ్ పెడ్లర్లతో కలిసి దందా చేస్తున్నట్టు గుర్తింపు
- పోలీస్ స్టిక్కర్లతో డ్రగ్స్ సప్లయ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈగల్ టీమ్
- సూర్య గ్యాంగ్ దందాలో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు
హైదరాబాద్, వెలుగు: నైజీరియన్ల డ్రగ్స్ నెట్వర్క్లో పోలీస్ అధికారుల కొడుకుల గట్టురట్టు అవుతోంది. స్థానిక డ్రగ్ పెడ్లర్లతో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు ఈగల్ (టీజీ ఏఎన్బీ) టీమ్ దర్యాప్తులో బయటపడింది. ఈ మేరకు సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్రావు కుమారుడు మోహన్, మాజీ అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్రావు కొడుకు రాహుల్ తేజను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. రాహుల్ తేజ గతేడాది డిచ్పల్లిలోనూ డ్రగ్స్ కేసులో పట్టుబడినట్టు తెలిసింది.
వీరిద్దరి కాంటాక్ట్లో ఉన్న డ్రగ్స్ కస్టమర్ల వివరాలు సేకరిస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న అన్నమనేని సూర్యను ఈ నెల 7న ఈగల్ టీమ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న హిమాయత్నగర్కు చెందిన హర్ష, కరీంనగర్కు చెందిన జువ్వాడి సందీప్, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్, రాహుల్ తేజ, పబ్బుల నిర్వాహకులు సహా మొత్తం 25 మందిని ఈగల్ టీమ్ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇందులో మోహన్, రాహుల్ తేజ పోలీస్ అధికారుల కుమారులుగా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలోనే సూర్య కాంటాక్ట్లో ఉన్న నైజీరియన్స్, గంజాయి సప్లయర్లు, క్యారియర్ల సమాచారం రాబడుతోంది.
పబ్బులకు సూర్య గ్యాంగ్ డ్రగ్ సప్లయ్ ఇలా
కొంపల్లికి చెందిన సూర్య.. మల్నాడ్ కిచెన్ పేరుతో స్థానికంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. సిటీలోని పబ్బుల కస్టమర్లు, ఐటీ ఎంప్లాయిస్ టార్గెట్గా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. ఇందులో భాగంగా సిటీలోని 10 పబ్బులకు రెగ్యులర్గా కొకైన్ ఓజీ గంజాయి సప్లయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మోహన్, రాహుల్ తేజతో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా కస్టమర్లను కాంటాక్ట్ అయ్యేవాడు. హిమాయత్నగర్కు చెందిన హర్ష, కరీంనగర్కు చెందిన జువ్వాడి సందీప్, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
వీరితో పాటు పోలీస్ అధికారుల కొడుకులు మోహన్, రాహుల్ తేజ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ, బెంగళూరు, గోవాలోని నైజీరియన్లు నిక్, జెర్రి, డెజ్మాండ్, స్టాన్లీ, ప్రిన్స్ల వద్ద కొకైన్, ఎక్స్టసీ పిల్స్, ఓజీ కుష్ గంజాయి కొనుగోలు చేస్తున్నారు. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు గుర్తించకుండా లేడీస్ హీల్స్, ఇంట్లో వినియోగించే ఆర్టికల్స్తో ప్యాక్ చేసి కొరియర్ల ద్వారా హైదరాబాద్కు డెలివరీ చేసుకుంటున్నారు. కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా పబ్బులు సహా ఐటీ ఉద్యోగులకు సప్లయ్ చేస్తున్నారు.
పోలీస్ స్టిక్కర్ వెహికల్స్తో డ్రగ్స్ సప్లయ్?
మోహన్, రాహుల్ తేజ పోలీస్ కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఎలాంటి భయం లేకుండా డ్రగ్స్ దందా చేసినట్టు ఈగల్ టీమ్ అధికారులు భావిస్తున్నారు. కస్టమర్లకు సప్లయ్ చేసే క్రమంలో వాహనాలకు పోలీస్ స్టిక్కర్ వేసుకుని డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సూర్య 2021 నుంచి గత నాలుగేండ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న నేపథ్యంలో.. మోహన్, రాహుల్ తేజ ఎంతకాలంగా సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రిసమ్, ఫార్మ్, బ్లాక్ 22, బ్రిడ్ బాక్స్, ఎక్స్ర, బ్రాడ్ వే. క్వక్ అరెనా పబ్బులు సహా సూర్య గ్యాంగ్ డ్రగ్ నెట్వర్క్లోని కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు నైజీరియన్ల డ్రగ్స్ నెట్వర్క్లో ప్రధాన సప్లయర్ల డేటాను రాబడుతున్నారు. వీరి డేటా ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పెడ్లర్లు, కస్టమర్ల సమాచారంతో ప్రొఫైల్స్ క్రియేట్ చేయనున్నారు. ఈ సమాచారాన్ని అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలైన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్ఐ సహా ఇతర సంస్థలకు అందుబాటులో పెట్టనున్నారు.