
- కామారెడ్డి జిల్లా బూర్గుల్కు నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డగింత
- వివేక్ వెంకటస్వామితోపాటు పలువురు నేతలు అదుపులోకి కార్యకర్తల అరెస్టు
- రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే అరుణతార
- టీఆర్ఎస్ గూండాగిరి చేస్తున్నది : వివేక్ వెంకటస్వామి
- కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక
కామారెడ్డి / నిజాంసాగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస-.. బీజేపీ భరోసా’ యాత్రపై పోలీసులు ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. శుక్రవారం బూర్గుల్ గ్రామంలో జెండా ఆవిష్కరణకు బయలుదేరిన నేతలను అడుగడుగునా అడ్డుకున్నారు. రోడ్లపైన బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
గ్రామానికి వెళ్లకుండా తున్కిపల్లి దగ్గర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణరెడ్డి తదితరులను అదుపులోకి తీసుకొని జీపులో ఎక్కించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార రోడ్డుపై బైఠాయించారు. చివరికి.. పోలీస్ వలయాన్ని ఛేదించుకొని పంట పొలాల నుంచి కొంత మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు బూర్గుల్కు చేరుకొని పార్టీ జెండా ఎగుర వేశారు.
‘ప్రజా గోస..- బీజేపీ భరోసా’ యాత్రంలో భాగంగా బూర్గుల్లో బీజేపీ జెండా ఆవిష్కణకు గద్దె నిర్మించగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాత్రి కూల్చివేశాయి. ప్రోగ్రాం కోసం వెళ్లిన బీజేపీ నేతలను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య రాత్రి ఘర్షణ జరిగింది. పోలీసుల హామీతో ఆందోళన విరమించిన బీజేపీ నేతలు శుక్రవారం అక్కడ జెండా ఎగుర వేస్తామని ప్రకటించారు. దీంతో పొద్దుటి నుంచే జిల్లా నలుమూలల నుంచి పోలీసులను రప్పించి బూర్గుల్కు వెళ్లే మార్గంలో రోడ్లపై భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. బొగ్గు గుడసె వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు.
పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్అరుణతారతో పాటు లీడర్లు, కార్యకర్తలు ర్యాలీగా తున్కిపల్లికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నడ్చుకుంటూ బూర్గుల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అడ్డంగా రోప్ పార్టీ తాడు పట్టుకొని ముందుకెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బూర్గుల్కు వెళ్లి పార్టీ జెండా ఎగుర వేస్తే తప్పేమిటని, శాంతియుతంగా వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఆ ఊరిలో పరిస్థితి బాగా లేదని, ఇప్పుడు అక్కడికి వెళ్లటం మంచిది కాదని పోలీసు ఆఫీసర్లు చెప్పారు. కనీసం ఐదుగురు వెళ్లి జెండా ఎగుర వేసి వస్తారని చెప్పినా వినకుండా అడ్డుకున్నారు. వివేక్వెంకటస్వామి, కాటిపల్లి వెంకటరమణరెడ్డి తదితరులను పోలీసు జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గంటకు పైగా వారిని పోలీసు జీపులోనే కూర్చోబెట్టారు.
రోడ్డుపై బైఠాయించిన అరుణతార
తున్కిపల్లిలో బీజేపీ నేతల్ని అడ్డుకున్న క్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార బూర్గుల్ వైపు కొంత దూరం పరుగెత్తుకుంటువెళ్లారు. పోలీసులు అడ్డుకోవండతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
వివిధ మార్గాల్లో వెళ్లి జెండా ఆవిష్కరణ
బూర్గుల్ గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడుగుడుగునా ఆటంకాలు కలిగించినప్పటికీ కొందరు బీజేపీ లీడర్లు, కార్యకర్తలు పంట పొలాల్లో నుంచి నడ్చుకుంటూ బూర్గుల్కు చేరుకొని రెండు చోట్ల పార్టీ జెండాలను ఎగురవేశారు. కొంత మంది స్థానిక యువకులను కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడికి మహిళ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ గీతామూర్తి , పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్ సాయిలు కూడా చేరుకున్నారు. అనంతరం అందరూ తిరిగి తున్కిపల్లికి వచ్చారు. జెండా ఎగుర వేయటానికి వెళ్లిన కార్యకర్తలకు సపోర్టుగా నిలిచిన బూర్గుల్ యువకులను వివేక్వెంకటస్వామి, అరుణతార సన్మానించారు.
కేసీఆర్కు గుణపాఠం తప్పదు: వివేక్
పోలీసులను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ గూండాగిరి చేస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ ప్రోగ్రామ్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ రాజ్యం నడుస్తున్నదని దుయ్యబట్టారు. శాంతియుతంగా కార్యక్రమం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎంత అడ్డుకున్నా బీజేపీ కార్యకర్తలు వెళ్లి జెండా ఎగుర వేశారని, బీజేపీ శ్రేణులు ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార మాట్లాడుతూ.. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పోలీసుల తీరును ఖండించిన సంజయ్, బాషా
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతారను బూర్గుల్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా వేర్వేరు ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ కేడర్పై టీఆర్ఎస్ నాయకులు బరితెగించి దాడికి పాల్పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ జెండాలను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని తెలిపారు.