
- ఆత్మార్పణ ప్రకటనతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కుటుంబ సభ్యులకు అప్పగింత
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించిన అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆమె స్వగ్రామానికి తరలించి గృహ నిర్బంధం చేశారు. వివరాల్లోకి వెళ్తే..దీపావళి మరుసటి రోజున హైదరాబాద్లోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రాణత్యాగం చేస్తానని అఘోరి ఇటీవల కేదార్నాథ్ వద్ద ఉండి ప్రకటించింది.
ఇందులో భాగంగా కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తున్న ఆమెను బుధవారం రాత్రి సిద్దిపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఆమె ఇంటికి ఎవరూ రాకుండా అడ్డు కున్నారు.
అయితే శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ఇంట్లోనే ప్రాణత్యాగం చేస్తుందని ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు అఘోరి కుటుంబ సభ్యులను బెల్లంపల్లికి తరలించి చర్చించారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో రూరల్ సీఐ అఫ్జలొద్దీన్, నెన్నెల ఎస్సై ప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.