ప్రాణ భయంతోనే రౌడీషీటర్ మర్డర్..బాలానగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ప్రాణ భయంతోనే రౌడీషీటర్ మర్డర్..బాలానగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • ముగ్గురు నిందితులు అరెస్ట్​.. రిమాండ్

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట బస్టాప్​ వద్ద అందరూ చూస్తుండగా ఓ రౌడీషీటర్​ను మరో రౌడీషీటర్​ హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్​ ఇన్​చార్జి డీసీపీ కోటిరెడ్డి గురువారం మీడియాకు వివరించారు. 

జగద్గిరిగుట్టకు చెందిన తానుగుండ్ల బాలశౌరెడ్డి అలియాస్​ బాద్​షా(21), ఐడీపీఎల్ రంగారెడ్డినగర్​కు చెందిన రోషన్​కుమార్​సింగ్​ అలియాస్​ రోషన్(22) ఇద్దరూ రౌడీషీటర్లు. వీరిద్దరూ పాత మిత్రులు. అమ్మాయిలతో అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల్లో ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. 

బాలశౌరెడ్డికి షరీఫ్​ అనే వ్యక్తితో శత్రుత్వం ఉంది. షరీఫ్​ విషయంలో జోక్యం చేసుకుంటే చంపేస్తానని రోషన్.. బాలశౌరెడ్డిని బెదించాడు. దీంతో తనను బెదిరించిన రోషన్​నే చంపేస్తే ఏ సమస్య ఉండబోదని బాలశౌరెడ్డి నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం తన మిత్రులైన జగద్గిరిగుట్టకు చెందిన సయ్యిద్​మహ్మద్(28), రేవో ఆదిత్య అలియాస్​ ఆది సాయం కోరగా, వారు అంగీకరించారు. ప్లాన్​ ప్రకారం బాలశౌరెడ్డి అమేజాన్​లో కత్తి కొన్నాడు. 

ముగ్గురు కలిసి రోషన్​ను బుధవారం మధ్యాహ్నం జగద్గిరిగుట్ట బస్టాప్​కు పిలిపించారు. అక్కడికి రోషన్​ వచ్చాక బాలశౌరెడ్డి మాటలు కలిపాడు. ఈ క్రమంలో బాలశౌరెడ్డితో వచ్చిన ఇద్దరు మిత్రుల్లో ఒకరు రోషన్​ను పట్టుకోగా, మరొకరు బైక్​పై సిద్ధంగా ఉన్నారు. బాలశౌరెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రోషన్​ను పొడిచాడు. ఆ తరువాత ముగ్గురు కలిసి బైక్​పై పారిపోయారు. రోషన్​ గాంధీలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు గురువారం నిందితులు బాలశౌరెడ్డి, సయ్యిద్​ మహ్మద్​, అదిత్యను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.