- లాఠీలతో కొట్టడంతో నడవలేని స్థితిలో బాధితుడు
- ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్కు కంప్లయింట్
కరీంనగర్, వెలుగు: ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే కారణంతో ఓ యువకుడిపై పోలీసులు థర్డ్డిగ్రీ ప్రయోగించారు. స్టేషన్కు పిలిపించి, లాఠీలతో కొట్టడంతో వీపు, అరికాళ్లు కమిలిపోయాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో ఇటీవల యాదవులు బీరప్ప ఉత్సవాలను వేర్వేరుగా జరుపుకున్నారు. గత వారం ఒక గ్రూపు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టీఆర్ఎస్ లీడర్లను ఆహ్వానించినప్పటికీ రాలేదు. ఈ వారం రెండో వర్గం జరుపుకున్న బీరప్ప ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల ప్రజాప్రతినిధులు, లీడర్లు హాజరయ్యారు. మొక్కులు చెల్లించాక భోజనం కూడా చేశారు. దీంతో మొదటి గ్రూపులో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తొంటి పవన్కుమార్ కోపంతో ఎమ్మెల్యే, ఇతర లీడర్లు భోజనం చేస్తున్న ఫొటోకు అభ్యంతకర కామెంట్ పెట్టి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలీసులకు కంప్లయింట్ చేశాడు. దీంతో తనను స్టేషన్కు పిలిపించిన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఎస్సై సామల రాజేశ్ లాఠీతో అరికాళ్లపై, వీపుపై కొట్టారని పవన్ అంటున్నాడు. తనపై శుక్రవారం సాయంత్రం దాకా ఎలాంటి కంప్లయింట్ రాలేదని, కానీ ఎమ్మెల్యే మెప్పు కోసం గురువారం ఉదయమే పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నారని ఆరోపించాడు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ సీపీకి కంప్లయింట్ చేశాడు. ఎస్ఐ, పోలీసుల దెబ్బలకు తాను లేచి నడవలేని స్థితికి చేరుకున్నానని కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్రావుతో విచారణ జరిపించి, ఎస్ఐది తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ తెలిపారు.