బాసర, వెలుగు:బాసర ట్రిపుల్ఐటీలో స్టూడెంట్లను లైంగిక వేధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వరాలపై నిర్భయ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు. డబ్బులు తీసుకొని పేపర్ లీక్ చేసిన వ్యవహారంలో రవి వరాలలో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్, రీవాల్యుషన్ ఇన్చార్జి విశ్వనాథ్పై కేసు పెట్టి బుధవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గురువారం బాసర పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్లపై కీచక ప్రొఫెసర్ రవి లైంగిక వేధింపులపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రొఫెసర్ రవి వరాలను బుధవారం హైదరాబాద్ బండ్లగూడలోని అతని బంధువుల ఇంట్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఉన్నత చదువులు చదివిన తాను మామూలు క్వాలిఫికేషన్ ఉన్న ప్రొఫెసర్లతో సమానంగా జీతభత్యాలు అందుకోవడం సహించలేక స్టూడెంట్లను పాస్ చేయిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అక్రమంగా వసూలు చేశాడన్నరు. ఈ వ్యవహారంలో రవి వరాలతో పాటు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్, రీవల్యూషన్ ఇన్చార్జ్ విశ్వనాథ్కు కొంత కొంత ఇచ్చేవాడన్నరు. ఈ క్రమంలో స్టూడెంట్ల ఎగ్జామ్ పేపర్లను ప్రొఫెసర్ సుధాకర్ నుంచి తీసుకొని రవి తన ఇంటి వద్ద రెమిడియల్( సప్లిమెంటరీ) పరీక్షలు రాయించే వాడన్నరు. ఇలా పరిచయమైన విద్యార్థినిలకు అసభ్యకరమైన మెసేజ్లు పంపడంతో కొందరు అతని మొబైల్ నంబర్ బ్లాక్ కూడా చేశారని తెలిపారు. బ్లాక్ చేసిన వారిని, అడ్డుచెప్పిన వారిని ఎగ్జామ్స్లో ఫేయిల్ చేస్తానని బెదిరించేవాడన్నరు. గతంలో తన కారులో స్టూడెంట్లను వరంగల్, కరీంనగర్కు సైతం తీసుకెల్లేవాడన్నారు. అక్రమంగా సంపాదించిన రూ.2.5 లక్షలు, ఐ10 కారుతో పాటు సుధాకర్, విశ్వనాథ్ల నుంచి 60 వేల చొప్పున .1.2లక్షలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ కోసం వీరిని రిమాండ్కు తరలించామన్నారు.