
ఏపీలో జరిగిన ఎన్నికల తీరు, పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై పలు పార్టీలకు చెందిన నేతలు ఈసీపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయిలో ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని ఆయన తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.
సమర్ధవంతంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైనందుకు ఈసీ సిగ్గుపడాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఎన్నికల వేళ పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకొనేందుకు కేంద్ర బలగాలను కూడా ఇవ్వకుండా, ఈసీ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఓ చోట పోలింగ్ బూత్లో హోంగార్డు మాత్రమే ఉన్నాడని దుయ్యబట్టారు.
పోలింగ్ జరిగిన తీరు దారుణంగా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలు కురిపించారు. రాత్రి పూట చీకటి గదుల్లో పోలింగ్ ఎలా నిర్వహిస్తారని ఆయన ఎన్నిక గోపాల కృష్ణ ద్వివేదిపై మండిపడ్డారు. అర్ధరాత్రి దాటినా పోలింగ్ నిర్వహించడం దారుణమని, ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.