ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రశీదు: పొంగులేటి

ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రశీదు: పొంగులేటి
  • దరఖాస్తు చేసుకునేందుకు కంగారుపడొద్దు..
  • ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటదో ముందే చెప్తం
  • మారుమూల గ్రామాలు, చెంచుల వద్దకూ అధికారులు వెళ్లాలి
  • ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఫారాలు వారితో పూర్తి చేయించాలి
  • గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును 
  • ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్

ఖమ్మం / హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి జరగనున్న ప్రజాపాలన గ్రామసభల్లో అన్ని స్కీములకు సంబంధించిన అప్లికేషన్లు అందుబాటులో ఉంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హత ఉన్న వాళ్లంతా అప్లికేషన్ నింపి అందజేస్తే అక్కడే రశీదు కూడా ఇస్తామని తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంగళవారం ఖమ్మంలో మీడియాతో పొంగులేటి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. తాము మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తామని చెప్పేందుకు ఇప్పటికే రెండు స్కీమ్స్ అమలు చేశామన్నారు.

‘‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా, ఒడిదుడుకులున్నా ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తాం. హామీలను నెరవేర్చే దిశగానే కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆలోచన, విధానాలను సీఎం రేవంత్ వివరించారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు మారుమూల గ్రామాలే కాకుండా, అటవీ ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరకు కూడా ఆఫీసర్లు వెళ్లి ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఫారాలు పూర్తి చేయించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి అక్కడే రశీదు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులను కుంటిసాకులుగా చూపించాలని మేం అనుకోవడం లేదు’’ అని వివరించారు. 

ధనిక రాష్ట్రమని.. లక్షల కోట్ల అప్పులు చేసిన్రు

‘‘తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన వాళ్లే, రూ.6 లక్షల 71 కోట్ల అప్పులు చేశారు. మేము ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చూపిస్తే.. బీఆర్ఎస్ వాళ్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు” అని పొంగులేటి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే ఉచితమని, ఉచితమంటే ఇందిరమ్మ రాజ్యమని, ఉచిత కరెంట్ కు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. గత ప్రభుత్వంలో మంత్రులెవరికీ జిల్లాలకు వెళ్లి రివ్యూలు చేసే స్వేచ్ఛ ఉండేది కాదని, పరిపాలన మొత్తం ఒక్క కుటుంబానికే పరిమితమై ఉండేదని ఆరోపించారు. గత పాలకులు రాష్ట్ర ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని చెప్పారు. ‘‘గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రెండ్రోజుల సమయం ఇచ్చి.. లిక్కర్ అప్లికేషన్లకు మాత్రం 15 రోజుల సమయం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు పెట్టుకునేందుకు కంగారుపడొద్దు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో అధికారులు సమాచారం ఇస్తారు” అని మంత్రి సూచించారు. 

జీహెచ్ఎంసీలో వార్డుకు 4 కౌంటర్లు: శ్రీధర్ బాబు

గ్రేటర్‌‌ హైదరాబాద్‌లోని 150 వార్డుల్లో ఒక్కో వార్డులో నాలుగు చోట్ల దరఖాస్తులను సేకరించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌తో కలిసి బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో ప్రజాపాలనపై అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో వార్డులో నాలుగు కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తాం. ఒక్కో కౌంటర్‌‌కు ఒక్కో టీమ్ లీడర్‌‌, 7 మంది సభ్యులు ఉంటారు. వార్డులోని ఏ బస్తీ, ఏ కాలనీలో, ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారన్న దానిపై ముందే సమాచారం ఇస్తారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం. దరఖాస్తులను నింపేందుకు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కౌంటర్ ఏర్పాటు చేసిన నాడు దరఖాస్తు చేసుకోకపోయినా.. వచ్చేనెల 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక సెపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశాం” అని ఆయన వివరించారు. గ్రేటర్ లోని 30 సర్కిల్స్ కి స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు. వీరు నియోజకవర్గాల వారీగా బుధవారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి సమావేశం నిర్వహించి వారి సూచనల మేరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ‘‘పెన్షన్ అందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజాభవన్ లో దరఖాస్తులు ఇచ్చిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాభవన్ వద్ద ఇప్పటి వరకు 22 వేల దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సేకరించేందుకు కూడా ప్రక్రియ జరుగుతున్నది. అందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందించేందుకు సమయం పడుతుంది’’ అని ఆయన తెలిపారు.

అందరి నుంచి అప్లికేషన్లు తీస్కుంటం: పొన్నం

ఆరు గ్యారంటీల దరఖాస్తు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వస్తుందని, ప్రతి కుటుంబం నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని 21 లక్షల మంది ఇండ్లకు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌ను నేడు సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు.

అన్నింటికీ ఒక్కటే అప్లికేషన్

  • ప్రజా పాలనలో భాగంగా అర్హుల నుంచి తీసుకునే దరఖాస్తులో మొదటి పేజీలో కుటుంబ వివరాలతో పాటు ఇంటి యజమాని పేరు, క్యాస్ట్, పుట్టిన తేదీ, ఆధార్, రేషన్ కార్డు, వృత్తి వివరాలను తీసుకుంటారు.
  • మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కు గ్యాస్ సిలిండర్​కు గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలు తీసుకోనున్నారు.
  • రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు రూ.15 వేలు ఇచ్చేందుకు రైతు, కౌలు రైతు కేటగిరీల వారీగా వివరాలు తీసుకోనున్నారు. పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం అడిగారు.
  • వ్యవసాయ కూలీలకు ఏటా12 వేలు  ఇచ్చేందుకు ఉపాధి హామీ కార్డు నంబర్ ఇవ్వాలి.
  •  ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేది ఒకటి. మరో కేటగిరీలో అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు.. నమోదైన కేసు, ఎఫ్ఐఆర్​ వివరాలు, ఎంతకాలం ఏ జైలులో ఉన్నారు? ఒకవేళ అమరులైతే చనిపోయిన సంవత్సరం, డెత్ సర్టిఫికెట్ వంటివి నింపాల్సి ఉంటుంది.
  • గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మీటర్ నంబర్, ప్రతినెల గృహ విద్యుత్ వినియోగం వివరాలు ఇవ్వాలి.
  • చేయూత పథకం కింద రూ.4 వేల కోసం వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళల జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి సర్టిఫికెట్లు, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు పొందేందుకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌కు ఒక రసీదు ఇస్తారు. అందులో ఏ అధికారి అప్లికేషన్ తీసుకున్నారో ఆయన పేరు తీసుకోనున్నారు. ప్రతి అప్లికేషన్​కు ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది.