కన్ఫ్యూజన్లో పొంగులేటి..ఎటూ తేల్చుకోలేక సతమతం

కన్ఫ్యూజన్లో పొంగులేటి..ఎటూ తేల్చుకోలేక సతమతం

హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి నెల రోజులు గడుస్తున్నా ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక పోతున్నారు. జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న ఆయన వాళ్లు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లలో ఒక్కదాన్నీ బీఆర్ఎస్ కు వదిలి పెట్టబోమని శపథం చేసిన పొంగులేటి.. పొలిటికల్ కన్ఫ్యూజన్ వీడడం లేదు. బీజేపీలో చేరాలా..? కాంగ్రెస్ కండువా కప్పుకోవాలా..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అంశంపై తర్జన భర్జనలో ఉన్నారు. ఈ నెల 4న బీజేపీ రాష్ట్ర నాయకులు ఖమ్మం వెళ్లి పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లితో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల అనంతరం కూడా పొంగులేటి ఓ క్లారిటీకి రాలేదు. తనతో బీజేపీ జాతీయ నాయకత్వం టచ్ లో ఉన్నదని, తన నిర్ణయం తర్వాత ప్రకటిస్తానంటూ దాట వేశారు. 

కర్నాటక ఎన్నికల ఫలితాలు పరిశీలించాక ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకుంటారని పొంగులేటి సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు పొంగులేటి అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు ఇదివరకే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరితే ఎలా ఉంటుంది.. జిల్లా ప్రజలు ఆదరిస్తారా..? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ సీట్లు సాధించవచ్చు.. పార్టీ చరిష్మా ఏమైనా కలిసొస్తుందా..? అనే అంశాలపై సన్నిహితులతో చర్చిస్తున్న పొంగులేటి ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తర్వాత టీఆర్ఎస్( ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటికి గులాబీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావును బరిలోకి దించింది. పొంగులేటికి ఏదైనా కీలక పదవి కట్టబెడతారని ప్రచారం జరిగింది. ఏండ్లు గడిచినా కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆయన క్రమంగా బీఆర్ఎస్ కు దూరమయ్యారు. ఇప్పటికీ ఏపీ సీఎం జగన్ తో సత్సంబంధాలు కలిగి ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయనతోపాటే పార్టీ వీడిన మాజీ మంత్రి జూపల్లి కూడా పొంగులేటి వెంటే నడుస్తారని తెలుస్తోంది. జూపల్లి.. పొంగులేటి నిర్ణయం కోసం వెయిటింగ్ లో ఉన్నారని సమాచారం. 

కొత్త పార్టీకి స్కోప్ ఉందా..?

పొంగులేటి రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఆయన ఏర్పాటు చేయబోయే పార్టీ పేరులో టీఆర్ఎస్ ఉండేలా ప్రయత్నిస్తున్నారని.. వీ6 డిజిటల్ గతంలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి బలం చేకూర్చేలా శ్రీనివాసరెడ్డి తన సన్నిహితులతో కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్నీ చర్చిస్తున్నట్టు సమాచారం. మరో వైపు కొత్త పార్టీ పెడితే ఎన్ని సీట్లలో ప్రభావం చూపగలం.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల గెలుస్తాం.. హంగ్ వస్తే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా..? అనే లెక్కలు కూడా వేసుకుంటున్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది.