- ప్రతి బడ్జెట్లో మనకు అన్యాయమే
- బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలి
- కేంద్రంతో మాట్లాడి నిధులు విడుదల చేయించాలి
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు అన్యాయమే చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించాలన్నారు.
గాంధీ భవన్ లో పొన్నం మాట్లాడుతూ ‘బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరగాలి. రాష్ట్రంపై ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నరు. తెలంగాణ పుట్టుకనే పీఎం అవమానించారు. భారత ఫ్యూచర్ సిటీకి కేంద్రం సహకరించాలి. ఆర్ఆర్ఆర్, మెట్రో, పెండింగ్ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి వెంటనే నిధులివ్వాలన్నారు.
కేంద్రం నుంచి ఏమీ అడగబోమని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంగా మాట్లాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రంతో సయోధ్య కోరుకుంటోంది. బడ్జెట్లో మా ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించాల్సిందే. తెలంగాణ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.
