- మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కొనుగోలు చేసిన వడ్లను దూర ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు కాకుండా ములకనూర్, ఎల్కతుర్తి పరిధిలోని మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. వేసవి కారణంగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశాలు చేసుకునేలా చూడాలన్నారు. జనగామ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని సూచించారు. మండలంలో ఆయిల్పామ్ సాగు పెరిగేలా హార్టికల్చర్ ఆఫీసర్లు రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వంగరలోని పీవీ విజ్ఞాన కేంద్రం పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అంతకుముందు కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ములుకనూర్ బస్టాండ్ను పరిశీలించి, ప్లాట్ఫామ్స్ను విస్తరించాలని, రోడ్ సైడ్ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీవో మేన శ్రీను, డీపీవో లక్ష్మీరమాకాంత్, హార్టికల్చర్ ఆఫీసర్ అనసూయ, డీఈవో గిరిరాజ్గౌడ్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో వీరేశం పాల్గొన్నారు.

