సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు దొరికిన ఆణిముత్యమని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ లాంటి వాడని కితాబిచ్చాడు. డివిలియర్స్ లాగే సూర్యకుమార్ కూడా 360 డిగ్రీల క్రికెటర్ అని మెచ్చుకున్నాడు. టీమిండియాలో సూర్యను మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ స్థానంలో ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఉన్న కారణంగా..సూర్యను నాల్గో స్థానం నుంచి బరిలో దించాలని భారత్కు పాంటింగ్ సూచించాడు.
మిడిలార్డర్లోనే సూర్యను దింపాలి..
సూర్యకుమార్ యాదవ్ను ఓపెనర్గా ఆడించాలన్న నిర్ణయం సరైంది కాదని పాంటింగ్ అన్నాడు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పాడు. మిడిలార్డర్లోనే సూర్యను దింపాలన్నాడు. సూర్య ఏబీ ఆడినట్లే ల్యాప్ షాట్స్, లేట్ కట్స్, ర్యాంప్ షాట్లు ఆడుతున్నాడని... ముఖ్యంగా లెగ్సైడ్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ మీదుగా అతడు కొట్టే ఫ్లిక్ షాట్లు అద్భుతమని ప్రశంసించాడు. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొగలడన్నాడు. విండీస్ టూర్లో సూర్యను ఓపెనర్గా టీమిండియా ఆడించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో..టీమిండియా బ్యాకప్ ఓపెనర్ లేకుండానే ఆసియా కప్లో ఆడబోతుంది.
పాక్పై భారతే గెలుస్తుంది..
ఆసియా కప్లో భారతే ఫెవరెట్ అని రికీ పాంటింగ్ అన్నాడు. అటు పాక్తో జరిగే మ్యాచులోనూ టీమిండియాదే విజయమని చెప్పాడు. 20 ఏళ్లుగా చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్కు క్రేజ్ తగ్గలేదని..క్రికెట్ చరిత్రలో రెండు జట్ల మ్యాచ్ అంటే ఉండే క్రేజే వేరన్నాడు. ఆసీస్, ఇంగ్లాండ్ కూడా చిరకాల ప్రత్యర్థులుగానే చూసినా..అది యాషెస్ సిరీస్కే పరిమితమవుతుందన్నాడు. కానీ భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పటికీ చిరకాల ప్రత్యర్థులుగానే పరిగణిస్తారని పాంటింగ్ పేర్కొన్నాడు. రెండు దేశాల అభిమానులు భావోద్వేగంతో మ్యాచ్ను చూస్తారని..అందుకే ఇది ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఆసియా కప్లో రెండు జట్లు 14 సార్లు తలపడితే.. భారత్ ఏడు మ్యాచుల్లో గెలిచింది. పాకిస్తాన్ ఐదింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదన్నాడు. అయితే ప్రస్తుత ఫాం, జట్టు ప్రకారం చూస్తే..టీమిండియానే గెలుస్తుందనుకుంటున్నాని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.