అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుకు 15 ల‌క్ష‌లు లంచం అడిగారు!

అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుకు 15 ల‌క్ష‌లు లంచం అడిగారు!

ముంబై: పోర్నోగ్ర‌ఫీ కేసులో గ‌తంలో అరెస్ట్ అయిన న‌టి గెహ‌నా వ‌శిష్ట్ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.15 ల‌క్ష‌లు లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేశార‌ని ఆరోపించింది. తాను ఏం త‌ప్పు చేయ‌లేద‌ని చెబితే, ఎలాంటి కేసులోనైనా ఇరికించ‌గ‌ల‌మ‌ని బెదిరించిన‌ట్లు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అరెస్ట్ అయిన ఆమె నాలుగు నెల‌ల జైలు త‌ర్వాత ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌లైంది. ప్రస్తుతం రోజూ వార్త‌ల్లో నిలుస్తున్న శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా పోర్నోగ్ర‌ఫీ కేసులోనూ ఆమె పేరు ఉన్న నేప‌థ్యంలో ఓ జాతీయ మీడియా చానెల్ శ‌నివారం నాడు గెహ‌నాను ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డానికి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని వాళ్ల‌కు వివ‌రించాన‌ని, అయినా స‌రే రూ.15 ల‌క్ష‌ల లంచం ఇవ్వాల్సిందేన‌ని వాళ్లు డిమాండ్ చేశార‌ని గెహ‌నా తెలిపింది. త‌న నిజాయ‌తీని నిరూపించుకునేందుకు మ‌రో ఇద్ద‌రు నిందితులు య‌శ్ ఠాకూర్ అలియాస్ అర్వింద్ కుమార్ శ్రీవాస్త‌వ‌, త‌న్వీర్ హ‌ష్మీల‌తో చేసిన వాట్సాప్ చాట్‌ను కూడా పోలీసుల‌కు చూపించాన‌ని ఆమె చెప్పింది. ఆ చాట్‌లో వాళ్లిద్ద‌రూ రూ.8 ల‌క్ష‌లు అరేంజ్ చేస్తామ‌ని ఉండ‌డంతో పోలీసులు డ‌బ్బు కోసం డిమాండ్ చేశారంది.

మ‌ళ్లీ ఇప్పుడు రాజ్ కుంద్రాపై న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోనూ త‌న పేరు పెట్టార‌ని న‌టి గెహ‌నా చెప్పింది. త‌మ‌పై కంప్లైంట్ చేసిన మ‌హిళ చెబుతున్న దానిని బ‌ట్టి ఆమె రెండు మూడు అడ‌ల్ట్ వీడియోల్లో న‌టించింది, అంటే వేర్వేరు వ్య‌క్తులు ఆమెను బ‌లవంతంగా ఆ వీడియోల్లో న‌టింప‌జేసి, డ‌బ్బులు ఇవ్వ‌డ‌మ‌నేది ఎలా సాధ్య‌మో చెప్పాల‌ని గెహ‌నా నిల‌దీసింది.