- ఏది నిజమో తెలియక అయోమయంలో జనాలు
- మళ్లీ టెస్టుల కోసం ప్రైవేటు సెంటర్లకు పరుగులు
- టెక్నికల్ ప్రాబ్లమ్ అంటున్న మెడికల్ ఆఫీసర్లు
“లంగర్హౌస్ పరిధిలోని సన్సిటీకి చెందిన సుధారాణి జలుబుతో బాధపడుతూ కొవిడ్ టెస్టు కోసం గోల్కొండ ఏరియా హాస్పిటల్కి సోమవారం వెళ్లింది. అక్కడ యాంటిజెన్ టెస్టు చేయించుకుంది. పాజిటివ్వచ్చిందని మెడిసిన్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉండాలని మెడికల్ సిబ్బంది చెప్పి పంపించారు. సాయంత్రం ఆమె ఫోన్కి నెగెటివ్ రిపోర్ట్ మెసేజ్వచ్చింది. ఇంతకు తనకు కరోనా ఉందా.. లేదా? అని ఆమెకు టెన్షన్ పట్టుకుంది. మళ్లీ ఓ ప్రైవేట్ సెంటర్ కు వెళ్లి ఆర్టీపీసీఆర్టెస్టుకు శాంపిల్ ఇచ్చింది.’’
కరోనా టెస్టులు చేసుకుంటున్న వారు అయోమయంలో పడుతున్నారు. సెంటర్ల వద్ద టెస్టులు చేయగానే పాజిటివ్వచ్చిందని హెల్త్ స్టాఫ్ చెప్పి మెడిసిన్ఇచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. అదే రోజు సాయంత్రం ఫోన్లకు టెస్ట్ రిపోర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. అందులో నెగెటివ్ వచ్చినట్లు ఉంటోంది. ఇలా ఒకరికి ఇద్దరికి కాదు.. వందలాది మందికి ఇలాగే వస్తున్నాయి. వాటిని చూసుకున్న బాధితులు తమకు కరోనా వచ్చిందా? రాలేదా అని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రైవేటు సెంటర్లకు వెళ్లి మరోసారి టెస్టులు చేయించుకుంటున్నారు. మరికొందరు నెగెటివ్వచ్చిందని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. ఇంకొందరికి అసలు మెసేజ్లే రావడం లేదు. మెడికల్ సిబ్బంది పొరపాట్లతోనే రిజల్ట్ సరిగా తెలియడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మెసేజ్లు తప్పుగా వస్తున్నట్లు, సెంటర్ వద్ద చెప్పిందే నిజమని పేర్కొంటున్నారు.
కొందరికి మెసేజ్లు వస్తలేవు
మెసేజ్లు వస్తున్న వారికి తప్పుడు రిపోర్టుల వస్తుంటే, చాలామందికి అసలు మెసేజ్లే రావడం లేదు. సిటీలో డైలీ12 వేల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో వేయి మంది వరకు ఫోన్లకు మెసేజ్లు వస్తలేవు. సెంటర్ వద్ద ఎక్కువ మంది ఉండడంతో కొందరికి రిజల్ట్ చెప్పలేకపోతున్నారు. అలాంటి వారికి మెసేజ్ రాకపోతే రిజల్ట్ ఏదో కూడా తెలియని పరిస్థితి ఉంది. కొందరికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాకపోతే, మరికొందరి ఫోన్ నంబర్లు ట్యాబ్లో ఎంట్రీ చేసే సమయంలో తప్పుగా చేస్తుండగా ఈ ఇబ్బంది వస్తోంది. ఒక్కో సెంటర్కి డైలీ వందలాది మంది వస్తుండడంతో ఫోన్ నంబర్లు రాసుకునే సమయంలో మెడికల్ సిబ్బంది తప్పుగా తీసుకుంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పాటు సిబ్బంది తప్పిదాల వల్ల కూడా మెసేజ్లు రావడంలేదు.
సరైన రిజల్ట్ రావడం లేదని..
ప్రభుత్వ సెంటర్లను చాలా మంది నమ్మడం లేదు. అక్కడ జనం ఎక్కువగా ఉంటుండడంతో ప్రైవేట్లో చేయించుకుందామని అనుకుంటున్నారు. అందులో రిపోర్టులు ఇలా తారుమారుగా వస్తుండడంతో ఉన్న కాస్త నమ్మకం పోతోంది. తప్పుడు రిపోర్టులు వస్తున్న వారిలో చాలా మంది తిరిగి ప్రైవేట్ సెంటర్లలో టెస్టులు చేయించుకుంటున్నారు. సర్కార్ సెంటర్లకు వెళితే సరైన రిజల్ట్ రావడంలేదని, అందుకే ప్రైవేట్సెంటర్లకు వెళ్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
మళ్లీ టెస్టుల కోసం
తప్పుగా మెసేజ్లు వచ్చిన వారు టెన్షన్ తో మరుసటి రోజు మళ్లీ టెస్టులు చేసుకునేందుకు సెంటర్లకు వెళ్తున్నారు. అంతకు ముందు రోజు టెస్ట్ చేసుకున్న సెంటర్ కి వస్తే చేయకపోతుండడంతో వేరే ఏరియాలకు వెళ్తున్నారు. సెంటర్దగ్గర పాజిటివ్అని చెప్పి ఇంటికెళ్లాక నెగటివ్అని మెసేజ్ లు వస్తున్నాయంటున్నారు. ఏది నిజమో తెలియక మళ్లీ టెస్టులు కోసం వస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
కొత్త యాప్తోనే సమస్య
కొత్త యాప్తోనే సమస్యలు వస్తున్నట్టు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. మొన్నటి వరకు స్టేట్ల్యాబ్ మేనేజ్ మెంట్ సిస్టం యాప్ ద్వారా కొవిడ్ రిపోర్టులు అప్ లోడ్ చేసేవారు. ఇందులో సెంటర్ వద్ద టెస్టింగ్కి ముందు మొబైల్కి ఓటీపీ వచ్చాక, ఆ నంబర్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసి శాంపిల్ కలెక్ట్ చేసేవారు. ఈ రిపోర్టులతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. వారం రోజుల నుంచి స్టేట్ కొవిడ్–19 టెస్టింగ్ కొత్త యాప్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పాత దాంట్లో మాదిరిగా అన్ని వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ నంబర్ చెబితే సరిపోతుంది. దీంట్లో ఓటీపీ ఆప్షన్ లేదు. ఈ యాప్ వల్ల టెస్టులు తొందరగా అవుతుండగా టెక్నికల్ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు వస్తున్నాయి.