- జీవో జారీచేసిన ఆర్అండ్బీ శాఖ
 
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కీలకమైన ముందడుగు పడింది. 700 ఎకరాల భూసేరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ సోమవారం జీవో నంబర్ 73 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలోని ఆరు ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధిని చేపట్టాలని 2018లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఆరు విమానాశ్రయాలకు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ తయారీకి కన్సల్టెన్సీ సేవలను అందించడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కన్సల్టెంట్ సంస్థను నియమించింది.
దీంతో ఏఏఐ ప్రతినిధులు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించి కొన్ని అనుమతులకు లోబడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ నివేదించిన ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం.. ఆదిలాబాద్ జిల్లాలోని విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని అక్కడి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
ఉత్తర తెలంగాణకు ఎంతో మేలు: మంత్రి వెంకట్రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి కోసం మొత్తం 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
