రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేశ్ చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో’. అలా మొదలైంది అనేది క్యాప్షన్. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవల రాజేంద్ర ప్రసాద్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో మూవీ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్న తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమా తమదే కావడం అదృష్టమని, ఈ సినిమా క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ నటన అబ్బురపరుస్తుందని మహేష్ చంద్ర చెప్పారు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యధ ఇది. అలాగని సెంటిమెంట్ సినిమా అనుకోవద్దు.. లవ్, రొమాన్స్, కామెడీ, పంచ్ డైలాగ్స్, పాటలు లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్టైనర్. త్వరలోనే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు .
ఇందులో పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) నిర్మిస్తున్నారు.
