వికారాబాద్, వెలుగు: ప్రజా పాలన దరఖాస్తుల వివరాలు తప్పులు దొర్లకుండా వెబ్ సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ నమోదుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన దరఖాస్తులను వెబ్ సైట్ లో నమోదు చేసేందుకు 57 టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి టీంలో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారన్నారు. ఒక్క టీం ప్రతి రోజు వెయ్యి దరఖాస్తులను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ అభివృద్ధికి అధికారుల కసరత్తు
కొడంగల్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం కొడంగల్లో పర్యటించారు. పురపాలిక పరిధిలోని 1035 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. టేకుల్ కోడ్, బొమ్మారాసిపేట్ పరిధిలోని అటవీ భూములను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, వెంకట్ రెడ్డిలతో కలిసి చేపట్టిన కలెక్టర్ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు.