
చాంగ్జౌ: ఇండియా స్టార్ షట్లర్ హెచ్. ఎస్. ప్రణయ్ రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ మ్యాచ్లో వరుసగా ఐదు మ్యాచ్ పాయింట్లు కాచుకుని సంచలన విజయం సాధించాడు. తొలి రౌండ్లో వరల్డ్ 35వ ర్యాంకర్ ప్రణయ్ 8-–21, 21–-16, 23–-21తో వరల్డ్ 18వ ర్యాంకర్ కొకీ వటానాబే (జపాన్)పై గెలిచాడు. 57 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఇండియా ప్లేయర్ తొలి గేమ్లో నిరాశపర్చాడు. కానీ రెండో గేమ్లో కీలక టైమ్లో పుంజుకుని ప్రత్యర్థి ర్యాలీలకు అద్భుతంగా చెక్ పెట్టాడు. ఇక డిసైడర్లో వటానాబే నుంచి ప్రతిఘటన ఎదురైంది. గేమ్ చివర్లో ప్రణయ్ వరుసగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని విన్నర్గా నిలిచాడు. మరో మ్యాచ్లో లక్ష్యసేన్ 21–14, 22–24, 11–21తో ఐదోసీడ్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు.
గంటా 7 నిమిషాల మ్యాచ్లో లక్ష్యసేన్ తొలి గేమ్లో నెగ్గినా మిగతా రెండు గేమ్ల్లో తన ట్రేడ్మార్క్ ఆటను చూపెట్టలేకపోయాడు. విమెన్స్ సింగిల్స్లో అనుపమ ఉపాధ్యాయ 23–21, 11–21, 10–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్తైపీ) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో అశిత్ సూర్య–అమృత ప్రథమేశ్ 12–21, 17–21తో రెహాన్ నుఫ్రల్–గ్లోరియా ఎమ్మాన్యుయెల్ (ఇండోనేసియా) చేతిలో, రోహన్ కపూర్–గద్దె రుత్వికా శివాని 27–25, 16–21, 14–21తో వాంగ్ టిన్ సీ–లిమ్ చు సియెన్ (మలేసియా) చేతిలో, విమెన్స్ డబుల్స్లో అమృత ప్రథమేశ్–సోనాలీ సింగ్ 12–21, 5–21తో సీహ్ పీ షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్తైపీ) చేతిలో, కవిప్రియా సెల్వం–సిమ్రాన్ సింగ్ 16–21, 14–21తో లారెన్ లామ్–అలిసన్ లీ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూశారు.