అయోధ్యకు హైదరాబాద్ నుంచి ప్రసాద సామగ్రి

అయోధ్యకు హైదరాబాద్ నుంచి ప్రసాద సామగ్రి

బషీర్ బాగ్, వెలుగు: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అయోధ్యకు హైదరాబాద్ నుంచి ప్రసాద సామగ్రిని పంపించారు. బషీర్ బాగ్ లోని శ్రీ నాగలక్ష్మీ మాత దేవాలయం నుంచి అయోధ్య ధామానికి వెళ్లే ప్రసాద సామగ్రి వాహనాన్ని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, దాతలు జెండా ఊపి ప్రారంభించారు. దాతల సాయంతో 45 రోజుల పాటు నిత్యం 5 వేల మందికి అన్నదానం ఏర్పాట్లు చేసినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారావు తెలిపారు.

అయోధ్యలో అన్నదానం చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక కమిటీని కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. హైదరాబాద్  నుంచి దాదాపు 150 మంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అయోధ్యకు వలంటీర్లుగా వెళ్తున్నారని తెలిపారు.

అలాగే 35 మంది వంటవాళ్లు కూడా రోజూ వండి  వడ్డించబోతున్నారన్నారు. అయోధ్యలోని గోలాఘాట్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న శ్రీరామస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.  నగరంలోని పలువురు దాతల నుంచి ఆహార తయారీకి కావాల్సిన 40 టన్నుల వివిధ సామగ్రిని సేకరించి పంపినట్లు  రామారావు పేర్కొన్నారు.