
కరోనా వైరస్ లాలాజలం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని కొందరు సైంటిస్టులు గుర్తించారు. అలాగే, కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లలో చిగుళ్లు వాయడం (పెరియోడాంటిటిస్) సమస్యను గమనించారు ఢిల్లీకి చెందిన డెంటిస్ట్ రీచా వత్స. ఈ టైంలో చిగుళ్లు, దంత సమస్యలు రాకుండా రీచా చెబుతున్న జాగ్రత్తలివి.
నీళ్లు సరిపోను తాగకపోతే డీహైడ్రేషన్కు లోనవుతారు. నోరు పొడిగా మారుతుంది. అప్పడు నోటితో శ్వాస తీసుకోవడం మొదలు పెడతారు. దాంతో నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే దాహం వేసేంత వరకు ఆగకుండా మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండాలి. ఫ్లోరిన్ ఉన్న టూత్పేస్ట్నే వాడాలి. హెల్దీ టీత్ కోసం రోజూ 3 నిమిషాలు కేటాయించాలి. రెండు నిమిషాలు బ్రష్ చేయాలి, దంతాల మధ్య ఇరుక్కున్న వాటిని ఎయిర్ ఫ్లాసర్ లేదా ప్రొక్సా బ్రష్ సాయంతో తీసేందుకు ఒక్క నిమిషం ఇవ్వాలి. నాలుకను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే రోజూ ఉదయాన్నే సగం టీస్పూన్ ఉప్పు కలిపిన కప్పు వేడినీళ్లు నోట్లో పోసుకొని10–12 సెకన్లు పుక్కిలించాలి.
బ్రష్ చేసేటప్పుడు దంతాలను గట్టిగా రుద్దకూడదు. అలాగే టంగ్ క్లీనర్తో నాలుక మీద ఎక్కువ సేపు రాయొద్దు. అలా చేస్తే నాలుక మీద ఉన్న మంచి బ్యాక్టీరియా పోతుంది. ఆకుకూరలు, బ్రైట్ కలర్స్లో ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు నోటి ఆరోగ్యం, శుభ్రతకు అవసరమైన పోషకాలు, లవణాలు ఉంటాయి. ఇవి దంతాలను కూడా హెల్దీగా ఉంచుతాయి. ఏ చిన్న దంత సమస్య వచ్చినా డెంటిస్ట్ను కలవాలి. ఆర్నెల్లకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. దాంతో నోటి, దంత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉన్న స్నాక్స్ తినడం, డ్రింక్స్ తాగడం వల్ల దంతాలు రంగు మారతాయి. అందుకే చిప్స్, స్వీట్స్, చాక్లెట్లు కాకుండా క్యారెట్ స్టిక్స్ వంటి హెల్దీ స్నాక్స్ తినాలి. అలాగే తరచూ యాసిడ్ ఉన్న ఫుడ్ తినడం, ఆల్కహాల్ తాగడం వల్ల కూడా దంతాలు సెన్సిటివ్ అవుతాయి.