- వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో సంబంధాల బలోపేతమే టార్గెట్
న్యూఢిల్లీ: మూడు యూరోపియన్ దేశాల పర్యటనకు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరారు. ఈ టూర్లో మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో సంబంధాల బలోపేతమే టార్గెట్గా పర్యటన చేపట్టారు. ఈ పర్యటన సోమవారం మోల్డోవా విజిట్తో ప్రారంభమవుతుంది. ఈ దేశానికి, అలాగే జులై 21 నుంచి 22 వరకు జరిగే ఉత్తర మాసిడోనియా టూర్కు ఒక భారత రాష్ట్రపతి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్.
మోల్డోవా ప్రెసిడెంట్ మైయా సాండూ, ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా-దావ్కోవాతో ముర్ము డెలిగేషన్ లెవెల్ చర్చలు జరుపుతారు. అగ్రికల్చర్, ఫార్మా, ఐటీ రంగాల్లో ఎకనామిక్ రిలేషన్స్ పెంచుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ టూర్ యూరోపియన్ యూనియన్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తోడ్పడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్, కార్యదర్శి సీబీ జార్జ్ తెలిపారు. తన పర్యటన చివరి దశలో భాగంగా జులై 23 నుంచి 25 వరకు ముర్ము రొమేనియాలో పర్యటించనున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా గ్యాప్ తర్వాత ఒక భారత రాష్ట్రపతి రొమేనియా వెళ్లడం ఇదే తొలిసారి. అక్కడ ప్రెసిడెంట్ నికుసర్ డాన్, ఇతర లీడర్లతో ఆమె భేటీ అవుతారు. భారత్-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముగియడంతో రాబోయే రోజుల్లో రొమేనియాతో ఆర్థిక భాగస్వామ్యం మరింత స్ట్రాంగ్ అవుతుందని ఎంఈఏ పేర్కొంది. కాగా, గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన ఈ మూడు దేశాలు, టెర్రరిజంపై పోరాటంలో భారత్కు ఫుల్ సపోర్ట్ ప్రకటించాయి.
