
వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ జులై 8న ఉదయం హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వరంగల్కి బయల్దేరారు. ప్రధాని పర్యటన వేళ ఆయా మార్గాల్లో ఎస్పీజీ, రాష్ట్ర పోలీసులు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. అక్కడికి చేరుకున్నఅనంతరం భద్రకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు కేవలం ఆరుగురు పూజారులు మాత్రమే పాల్గొననున్నారు.
ఆలయంలో 15 నిమిషాల పాటు ప్రధాని ఉండనున్నారు. దీంతో ఆలయ పరిసరాలు హై ప్రొటెక్షన్ జోన్లోకి వెళ్లాయి. గర్భగుడి ముందు ఆయన 5 నిమిషాలు ధ్యానం చేయనున్నట్లు సమాచారం. పూర్ణకుంభంతో మోదీకి అర్చకులు స్వాగతం పలకనున్నారు.
రెండున్నర గంటల పాటు కొనసాగనున్న తన టూర్లో.. మొత్తం రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, రూ.5,550 కోట్లతో 176 కిలోమీటర్ల జాతీయ రహదారులు సహా మొత్తం రూ.6,100 కోట్ల పనులను ప్రారంభించనున్నారు. తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్తో పాటు ఇతర నేతలు శుక్రవారమే వరంగల్ చేరుకొని జన సమీకరణ, సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనం భారీగా వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు