పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. చలించిపోయిన ఏపీ డిప్యూటీ సీఎం !

పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. చలించిపోయిన ఏపీ డిప్యూటీ సీఎం !

హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిశారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న జనసేనానిని హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు.

పవన్ కల్యాణ్ను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పవన్ కుటుంబ సభ్యులతో మోడీ మాట్లాడారు.  సైనస్‌ సమస్య కారణంగా పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల ముక్కుకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మంత్రి తన ఇంటికి వచ్చి పరామర్శించడంపై పవన్ కల్యాణ్ తన ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగంతో నిండిన పోస్ట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి సాదరంగా స్వాగతం పలికే గొప్ప గౌరవం తనకు దక్కిందని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఆయన దయతో తన ఇంటికి రావడం, ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందని పవన్ పోస్ట్ చేశారు. ప్రధానిగా ఆయనకు తీరిక లేనప్పటికీ.. అపారమైన బాధ్యతలు ఉన్నప్పటికీ, సమయం కేటాయించి తనను పలకరించేందుకు వచ్చారని పవన్ భావోద్వేగభరితంగా పోస్ట్ పెట్టారు.

ప్రధాని తన ఇంటికి వచ్చి పరామర్శించడాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పవన్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 19న.. తనకు శస్త్రచికిత్స జరిగిన వెంటనే.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని పవన్ గుర్తుచేశారు.

►ALSO READ | కలియుగ వైకుంఠం.. తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

ఈ కష్ట సమయంలో తనకు హృదయపూర్వక భరోసా ఇచ్చారని పవన్ చెప్పారు. మోడీ ప్రతీ ఒక్కరినీ తమ కుటుంబ సభ్యుల్లా చూస్తారని, ఆయన తన ఆలోచనలు, చేతలలో ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారని పవన్ ప్రశంసించారు.

ఇదే ఆయనను విశిష్టమైన వ్యక్తిగా నిలుపుతుందని, దేశానికి నాయకత్వం వహించే అపారమైన బాధ్యతను మోస్తున్నప్పటికీ.. ఆయన కరుణ, వ్యక్తిగత శ్రద్ధ, ప్రజలతో ఆయనకున్న భావోద్వేగ అనుబంధం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పవన్ తెలిపారు.