
- వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ కలలు సాకారం చేసుకుందాం
- జీ 20 సమిట్ ముగింపు వేడుకలో నరేంద్ర మోదీ పిలుపు
- ప్రెసిడెన్సీ గ్యావెల్ను బ్రెజిల్ అధ్యక్షుడికి అందించిన ప్రధాని
- నవంబర్ లో వర్చువల్ సమిట్ నిర్వహించాలని ప్రతిపాదన
- సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీ, ఏఐపై దృష్టిసారించాలని సూచన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల18వ జీ20 సమిట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ‘స్వస్తి అస్తు విశ్వ(ప్రపంచమంతా శాంతి నెలకొనాలి)’ అనే నినాదంతో సమిట్ను ముగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ప్రతిపాదించిన ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ రోడ్ మ్యాప్ సజావుగా సాగుతుందని ఆకాంక్షించారు. జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ప్రధాని అప్పగించారు. సమిట్ మొదటి రోజే ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్’ను ఏకాభిప్రాయంతో ఆమోదింపజేయడం దౌత్యపరంగా కీలక మైలురాయిగా నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధంపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ‘‘ఇది యుద్ధాల కాలం కాదు” అన్న భారత్ అభిప్రాయంతో కూటమి దేశాలన్నీ ఏకీభవించాయి. ఆదివారం ముగింపు సమావేశంలో ఆనవాయితీ ప్రకారం జీ20 చైర్ ట్రెడిషనల్ గ్యావెల్ (సుత్తి)ను డ సిల్వాకు మోదీ అందజేశారు.
అయితే, ఇండియా జీ20 ప్రెసిడెన్సీ పదవీకాలం నవంబర్ చివరి వరకూ ఉన్న నేపథ్యంలో నవంబర్ లో వర్చువల్ సమిట్ నిర్వహించాలని ప్రధాని ప్రతిపాదించారు. ప్రస్తుత సమిట్ లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఆ సమిట్ లో సమీక్షించాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అధికారికంగా జీ20 బాధ్యతలను చేపట్టనున్న బ్రెజిల్.. ఆ బాధ్యతలను ఏడాది పాటు సమర్థంగా నిర్వహిస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. జీ20 కూటమి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బ్రెజిల్ కు జీ20 గ్యావెల్ ను ఇండియా అందజేసింది. ప్రపంచ ఐక్యత, సౌభాగ్యం కోసం ఇదే డెడికేషన్, విజన్ తో వాళ్లు ముందుకు వెళ్తారన్న పూర్తి విశ్వాసం ఉంది” అని మోదీ అన్నారు. ‘‘ఈ రెండు రోజుల్లో మీరంతా మీ అభిప్రాయాలు, సూచనలు, ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. వీటన్నింటినీ నిశితంగా పరీశీలించి, అమలు దిశగా ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. నవంబర్ చివర్లో మరో జీ20 సమిట్ ను వర్చువల్ గా నిర్వహించి, వీటన్నింటిపై సమీక్ష నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నా. ఆ సెషన్ లో కూడా అందరం కలుసుకోవాలని ఆశిస్తున్నా. దీనితో, జీ20 సమిట్ ముగిసిందని ప్రకటిస్తున్నా” అని మోదీ కూటమి దేశాధినేతలను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తూ ‘స్వస్తి అస్తు విశ్వ’ అనే సంస్కృత శ్లోకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.
మోదీకి ఇండోనేసియా, బ్రెజిల్ మొక్కలు
జీ20 సమిట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘వన్ ఫ్యూచర్’ సమావేశంలో జీ20 గత ప్రెసిడెంట్ అయిన ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో, జీ20 తదుపరి ప్రెసిడెంట్ అయిన బ్రెజిల్ అధ్యక్షుడు డ సిల్వా తమ దేశాల నుంచి తెచ్చిన చెరో మొక్కను ప్రస్తుత జీ20 ప్రెసిడెంట్ అయిన ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం భారత్ మండపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
తర్వాతి సమిట్ 2024లో..
జీ20 కూటమిలో ఇండియా సహా 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ మెంబర్లుగా ఉండగా, ఈ సమిట్లో కొత్త గాA ఆఫ్రికన్ యూనియన్ కూడా చేరింది. దీంతో కూటమిలోని మెంబర్ల సంఖ్య 21కి పెరిగింది. 19వ జీ20 సమిట్ 2024 నవంబర్లో బ్రెజిల్లోని రియో డీ జెనీరో నగరంలో జరగనుంది.
భద్రతామండలిని విస్తరించాలి
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్) వంటి ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచానికి తగినట్టుగా ఆయా సంస్థలను విస్తరించాలన్నారు. ‘‘ఐక్యరాజ్యసమితిని 51 దేశాలతో స్థాపించినప్పుడు అప్పటి ప్రపంచం వేరు. ఇప్పుడు ఇందులో 200 దేశాలున్నాయి. కాలానికి అనుగుణంగా మారకపోతే దానికి విలువ ఉండదు” అని ప్రధాని తేల్చిచెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీ అంశాలు.. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత, భవిష్యత్తు సమస్యలని ఆయన అన్నారు. సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో కరెన్సీ అనేది కొత్త సవాల్ గా మారిందని, దీనిని నియంత్రించేందుకు ప్రపంచ స్థాయిలో ఒక మెకానిజాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. టెర్రరిజానికి ఫండింగ్ అందించడంలో సైబర్ స్పేస్ కొత్త వనరుగా మారిందని, సైబర్ స్పేస్ ను భద్రంగా మార్చేందుకు గ్లోబల్ కోఆపరేషన్, ఫ్రేంవర్క్ అవసరమన్నారు. ప్రతి దేశానికీ భద్రతను సాధించినప్పుడే ‘వన్ ఫ్యూచర్’ అన్న భావన బలోపేతం అవుతుందని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనా ఒక ఫ్రేంవర్క్ ఉండాలన్నారు.
ఆర్ఆర్ఆర్.. మస్తు నచ్చింది
ఆర్ఆర్ఆర్ సినిమా నాకు బాగా నచ్చింది. ఇందులో అద్భుతమైన సన్నివేశాలు, హుషారైన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. భారత్పై బ్రిటిష్ నియంత్రణను ఇందులో విమర్శనాత్మకంగా చూపించారు. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత నేను కలుసుకున్న ప్రతి ఒక్కరితో ఆర్ఆర్ఆర్ మూవీ చూశారా? అని అడిగేవాడిని. సినిమా డైరెక్టర్కు, నటీనటులకు నా అభినందనలు.
- లూయిజ్ ఇనాసియో
లులా డ సిల్వా, బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామి నారాయణుడికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రాంగణం అంతా కలియతిరిగారు.
పేరు మారిస్తే మూల్యం తప్పదు
ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకు మోదీ సర్కారు ఏకంగా దేశం పేరునే మార్చాలని చూస్తోంది. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. నిజానికి భారత్, ఇండియా రెండు పేర్లూ మంచివే. కానీ పేరు మార్పు వెనుక కేంద్రానికి దురుద్దేశాలు ఉన్నాయి.
- ప్యారిస్లో రాహుల్గాంధీ కామెంట్స్