
నిజామాబాద్, వెలుగు: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు డీఎస్ సతీమణి విజయలక్ష్మికి గురువారం సంతాప లేఖ పంపారు. రాజకీయాల్లో డి.శ్రీనివాస్కు గౌరవమైన స్థానం ఉందని, తన శక్తి సామర్థ్యాలతో ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు.
ఎంపీ అర్వింద్కు రాహుల్ సంతాప లేఖ
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి.శ్రీనివాస్ చిరస్మరణీయుడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. డీఎస్ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన కుమారుడు ఎంపీ అర్వింద్కు గురువారం సంతాప లేఖ పంపారు. డీఎస్ బతికున్నంత కాలం ప్రజాసేవకు, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారన్నారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. తండ్రిని కోల్పోవడంతో కొడుకు పడే వేదనను అర్థం చేసుకోగలనని.. డీఎస్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.