
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్లో ముంబై మీటియర్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోరులో ముంబై 3–-0 (15-–12, 15–-10, 15–-11) తేడాతో ఢిల్లీ తూఫాన్స్ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన ముంబై ఢిల్లీకి ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.
ఎటాకింగ్లో శుభమ్ చౌదరి అద్భుతమైన గ్యాప్ షాట్లతో పాయింట్లు సాధించగా, కెప్టెన్ అమిత్ గులియా తన పదునైన సర్వీస్లతో ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టాడు. దీనికి కార్లోస్ బెరిస్ పవర్ఫుల్ స్పైక్తో సాధించిన సూపర్ పాయింట్ తోడవడంతో ముంబై సులువుగా సెట్లను కైవసం చేసుకుంది. అద్భుతమైన సెట్టింగ్తో ఆటను నిర్దేశించిన వసంత్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.