గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి స్కీమ్ కింద నియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో పేద ముస్లిం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈ సహాయం అందిస్తున్నామని, రాబోయే 15 రోజుల్లోనే గద్వాల నియోజకవర్గానికి మరో 200 కుట్టు మిషన్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో డిగ్రీ వరకు ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం గద్వాల మండల పరిధిలోని గోన్పాడు గ్రామంలోని 25 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
