Ranji Trophy 2025-26: టెస్టుల్లో పృథ్వీ షా టీ20 విధ్వంసం.. రంజీ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

Ranji Trophy 2025-26: టెస్టుల్లో పృథ్వీ షా టీ20 విధ్వంసం.. రంజీ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇండియా జట్టులో స్థానం కోసం తీవ్రంగా పోరాడుతున్న షా రంజీ ట్రోఫీలో రఫ్ఫాడిస్తున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని సంచలనం సృష్టించాడు. కొంతకాలంగా ఫామ్ లేమి.. ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఈ ముంబై బ్యాటర్ ఎట్టకేలకు తనలోని పాత ఫామ్ ను బయటపెట్టాడు. మహారాష్ట్ర తరపున ఆడుతున్న షా సోమవారం (అక్టోబర్ 27) చండీగఢ్ తో జరిగిన మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో ఈ ఘనతను అందుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా షా 156 బంతుల్లో 222 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 141 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న షా రంజీ ట్రోఫీ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయడం విశేషం. తొలి స్థానంలో రవిశాస్త్రి ఉన్నాడు. 1985 లో శాస్త్రి బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. జట్టు చేసిన 359 పరుగులలో షా ఒక్కడే 222 పరుగులు చేయడం విశేషం. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర  313 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో చెలరేగితే   అర్షిన్ కులకర్ణి (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. చండీఘర్ బౌలర్లలో విక్కీ ఓస్ట్వాల్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చండీఘర్ తమ తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ లో మహారాష్ట్ర 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 464 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చండీఘర్ ప్రస్తుతం వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. చండీఘర్ విజయానికి మరో 390 పరుగులు అవసరం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.