
పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘విలాయత్ బుద్ద’. జయన్ నంబియార్ దర్శకుడు. జేక్స్ బిజోయ్ దీనికి సంగీతం అందించాడు. తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా టీజర్ను విడుదల చేశారు.
‘వాడి పేరు మోహన్.. ఊళ్లో అందరూ డబుల్ అంటారు.. వాడే మెయిన్ ఏజెంట్.. చందనం బిజినెస్ అంతా వాడి ద్వారానే జరుగుతోంది.. చిన్న సైజ్ వీరప్పన్’ అని పోలీస్ ఆఫీసర్ చెప్పిన డైలాగ్స్తో పృథ్విరాజ్ పాత్రను పరిచయం చేశారు. ‘నువ్వేమైనా ‘పుష్ప’ అనుకుంటున్నావా అని పోలీస్ అడుగుతుంటే.. తను ఇంటర్నేషనల్.. మనం లోకల్’ అంటూ పృథ్విరాజ్ చెప్పే డైలాగ్ టీజర్కు హైలైట్గా నిలిచింది.
ఐదేళ్ల క్రితం ఇదే టైటిల్తో జీఆర్ ఇందుగోపన్ రాసిన నవల ఆధారంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్నారు. ఓ స్కూల్ టీచర్ తన ఇంటి దగ్గర్లో పెంచుతున్న అరుదైన రకం గంధపు చెట్లపై లోకల్ స్మగ్లర్ కన్ను పడుతుంది. ఒకప్పుడు ఆ టీచర్కు శిష్యుడు ఇతను. ఇద్దరి మధ్య ఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది నవలలో ప్రధాన కథ. షమ్మి తిలకన్ టీచర్గా నటించాడు.
డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియుమ్ (‘భీమ్లా నాయక్’ మాతృక) చిత్రాల దర్శకుడు సచి 2020లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. అదే ఏడాది జూన్లో ఆయన చనిపోవడంతో తన అసోసియేట్ జయన్ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. సచి గత చిత్రాల తరహాలో ఇది కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో ఇష్యూస్తో సాగే కథ కావడం విశేషం.