
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియా, వాట్సాప్లలో వదంతుల ప్రచారం జరుగుతోందన్నారు. అసత్య ప్రచారాలు చేయొద్దని, వాటి వల్ల ప్రజల్లో భయం పెరిగే అవకాశం ఉందని, ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని కోరారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారంతా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారే తప్ప.. తెలంగాణలోనే ఉంటున్న వారికి ఒక్కరికీ రాలేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వివరించేందుకు ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్తిలో 47 మంది అనుమానితులు చేరగా.. వారికి టెస్టులు చేయగా 45 మంది కరోనా లేదని తేలిందని చెప్పారు. మరో ఇద్దరి శాంపిల్స్పై డౌట్ ఉండడంతో పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని తెలిపారు మంత్రి ఈటల. రేపు సాయంత్రంలోపు వారికి కరోనా ఉందా లేదా అన్న దానిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.
81 శాతం మందికి వైరస్ వచ్చినట్టే తెలియదు
వాట్సాప్, సోషల్ మీడియాలో కరోనా గురించి లేనిపోని వదంతులు ప్రచారం జరుగుతున్నాయని, వైరస్ వస్తే చావుతప్పదని రకరకాల అబద్ధాలు సర్క్యులేట్ అవుతున్నాయని అన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల. ఈ వదంతులను నమ్మొద్దని ఆయన కోరారు. కరోనా వ్యాప్తిపైనా అనవసర భయాలు వద్దని, ఇది గాలిలో వ్యాపించే వైరస్ కాదని చెప్పారు. ఇమ్యూనిటీ పవర్ను బట్టి దాదాపు 81 శాతం మందికి ఈ వైరస్ వచ్చినట్లు కూడా తెలియకుండానే నయమైపోతుందని, 14 శాతానికే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లో ఐటీ ఆఫీసుల ఖాళీ అవుతున్నాయన్న ప్రచారం కూడా అవాస్తవమని, కేవలం ఒక్క కంపెనీ మాత్రమే ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు.
భయాందోళనలో మహేంద్రా హిల్స్ ప్రజలు
సికింద్రాబాద్లోని మహేంద్రా హిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ యువకుడికి కరోనా రావడంతో.. ఆ ఏరియాలోని ప్రజలు తీవ్రమైన భయాందోళనలో ఉన్నారని అన్నారు మంత్రి ఈటల. దీనికి సోషల్ మీడియాలో జరుగతున్న ప్రచారం కూడా కారణమేనని అన్నారు. కరోనా బాధితుడి ఇంటి తలుపులు తీసినా చుట్టుపక్కల వారు ఒప్పుకోవడం లేదన్నారు. ఇలా భయపడాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ గాలిలో వ్యాపించదని, కరోనా బారినపడిన వారు దగ్గిన్పప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు పైన పడితేనే వైరస్ సోకుతుందని చెప్పారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స
ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్స అందుబాటులో ఉందని, అయితే ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఈ వైరస్ బారినపడిన వారికి ట్రీట్మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి. పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వార్డుల ఏర్పాటు చేసేందుకు తాము వాటి యాజమాన్యాలను కోరగా ఏకంగా చికిత్స చేసేందుకు కూడా సిద్ధమని తెలిపాయని వివరించారు ఈటల. అపోలో, మమత, కామినేని, ప్రతిమ, సాధన, వీఆర్కే, మహావీర్, సురభి, భాస్కర, మల్లారెడ్డి, మెడిసిటీ సహా పలు ప్రైవేటు ఆస్పత్రులు ముందుకు రావడంతో కేంద్రంతో మాట్లాడి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే చాలా ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాయన్నారు.
తెలంగాణలో ఒక్కరికీ రాలేదు
ఇప్పటి వరకు కరోనా సోకిన వారంతా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారే తప్ప.. తెలంగాణలోనే ఉంటున్న వారికి ఒక్కరికీ రాలేదని చెప్పారు ఈటల రాజేంద్ర. దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరకముందు అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారని, అక్కడ డాక్టర్లు, ఇతర స్టాఫ్ట్ ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని చెప్పారు. ఒకే ఇంట్లో, రూమ్లో కలిసి ఉన్నా, బస్సులో కలిసి ప్రయాణం చేసినా వైరస్ బారిన పడడం ఖాయమన్న ప్రచారం అవాస్తమని తెలిపారు మంత్రి ఈటల. ఈ విషయాలను అవగాహన పెంచేలా భారీగా ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు.
సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనాపై ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రజలు 104 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయొచ్చని చెప్పారు మంత్రి ఈటల. వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి 24 గంటలూ తాను, సీనియర్ ఐఏఎస్ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ, సర్వైలెన్స్ కమిటీ, సమాచార, అవగాహనకు కమిటీ, ప్రొక్యూర్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఉండేలా అన్ని రకాలుగా తాము కృషి చే్స్తున్నామన్నారు.