
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. యాజమాన్యాలు జీతాలు ఇవ్వక పోవడంతో రోడ్డున పడ్డారు. దీంతో కుటుంబ పోషణకోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఎంతటి చిన్న పని అయినా చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం. కోటపాడుకు చెందిన సాంబశివ ఓ ప్రైవేట్ స్కూల్ లో హిందీ టీచర్ గా పనిచేసేవారు. ఇప్పటి వరకు స్కూళ్లు ఓపెన్ కాకపోవడంతో..స్కూలు యాజమాన్యం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో సాంబశివ…విశాఖ సిటీ వదిలి సొంతూరు వెళ్లిపోయారు. కుటుంబ పోషణ కోసం ఇంటి దగ్గర ఉదయం, సాయంత్రం కూరగాయలు అమ్ముతున్నాడు. మధ్యాహ్నం సమయంలో సైకిల్ పై వీధుల్లో తిరిగి చీపుర్లు అమ్ముతున్నాడు. స్కూల్లో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు….వీధుల్లో చీపుర్లు అమ్మడం దారుణమంటున్నారు స్థానిక ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ టీచర్లను ఆర్ధికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.