మునుగోడు బై పోల్ పై ప్రియాంక ఫోకస్

మునుగోడు బై పోల్ పై ప్రియాంక ఫోకస్

న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అనే అంశాలపై ఈ భేటీలో చర్చించారు.

ముఖ్యంగా మునుగోడు బై పోల్ పై ఫోకస్ పెట్టిన ప్రియాంక గాంధీ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్, బీజేపీ సభల గురించి రాష్ట్ర నేతలు ప్రియాంక గాంధీకి వివరించారు. ఈ క్రమంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ ​ మాణిక్కం ఠాగూర్ తమను పట్టించుకోవడం లేదని కొందరు సీనియర్లు ప్రియాంకకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్... అందుకు కావాల్సిన ప్రణాళిక రూపకల్పన గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ , శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఆహ్వానం అందినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సమావేశానికి వెళ్లలేదు.